తిరుమల శ్రీవారి హుండీలో చోరీ: సీసీ కెమెరాలున్నా రూ.50వేలు లాగేశాడు
తిరుమల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో చోరీ జరిగింది. శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించే మొబైల్ హుండీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అర్జున్ అనే వ్యక్తి రూ.50వేలు కాజేశాడు.
కాగా, ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దంతో చోరీని గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) విజెలెన్స్ విభాగం అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుమల క్రైం పోలీసులకు అప్పగించారు.
భక్తుల రద్దీ సాధారణం: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీ ఆర్పీ ఠాకూర్, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యక్తిగత కార్యదర్శి లక్షీనారాయణ బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
జయంతి ఉత్సవాల వైభవం
శ్రీ త్యాగరాజస్వామి వారి 250వ జయంతి మహోత్సవాల్లో భాగంగా స్థానిక త్యాగరాజ మండపంలో జరుగుతున్న సంగీత కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రుతా రాజన్, డాక్టర్ వేణుగోపాల్ తమ ఉపన్యాసంలో త్యాగరాజస్వామి కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో త్యాగరాజస్వామి శిష్య పరంపర చేసిన కృషిని శ్లాఘించారు.
వివిధ రకాల త్యాగరాజ కీర్తనలను సోదాహరణ విశ్లేషణ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చెన్నైకు చెందిన గాయత్రీ గిరీష్ తన గాత్ర కచేరితో అలరించారు. వీరికి సహకారంగా అనంతకృష్ణణ్ వయోలిన్, శంకరనారాయణ మృదంగంతో సహకరించారు. ఈ సందర్భంగా 'మేరు సమాన ధీర', 'నన్నుబ్రోవ నీకింత తామసమా' 'ఈ వసుధ నీవంటి దైవం' తదితర త్యాగరాజ కీర్తలను ఆలపించారు.