నాడు చంద్రబాబు - నేడు సీఎం జగన్ : ముంచేస్తున్న "భజన" బ్యాచ్..!!
అధికారంలోకి తిరిగి రావాలి..వస్తాం అనేది విశ్వాసం. ధీమా. కానీ, విశ్వాసం ఇప్పుడు ఏపీలోని రెండు పార్టీల్లోనూ అతి విశ్వాసంగా మారుతోంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నివేదికలతో పార్టీ అధినేతలకు మేలు చేస్తాయా.. నష్టం చేస్తాయా అనే డైలమా పార్టీనే నమ్ముకున్న వారికి మాత్రం పజిల్ గా మారుతోంది. ఏపీ రాజకీయాల్లో కోర్ టీంలు..కోరస్ లు కామన్ గా కనిపిస్తున్నాయి. చంద్రబాబు అయినా.. సీఎంగా జగన్ ఉన్నా.. పక్కవ ఉండే భజన బ్యాచ్ లు మాత్రం కామన్. ఇవే..ఇప్పుడు పార్టీ అధినేత కమ్ సీఎం స్థానంలో ఉన్న వారికి - క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పని చేసే రియల్ ఫైటర్స్ మధ్య అడ్డుగా మారుతున్నాయి. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు ఒక కోర్ టీం ఉండేది. ఆ టీంలో ఉన్న సభ్యుల గురించి పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

అధినేతకు - కేడర్ మధ్య గ్యాప్
ప్రతీ అంశాన్ని సీఎంగా- పార్టీ అధినేతగా అన్నీ స్వయంగా చూసుకొనే వెసులుబాటు లేక, నమ్మిన వారికి నాడు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. అసలు గ్రౌండ్ రియాల్టీ గురించి తెలిసినా..తెలియనట్లుగా, పట్టించుకోకుండా పూర్తిగా మేనేజ్ మెంట్ స్కిల్స్ పైన ఆధారపడటం వలనే టీడీపీ ఓడిపోవటమే కాదు.. ఏకంగా 23 స్థానాలకు పడిపోయింది. ఇది రాజకీయంగా అనుభవం ఉన్న వారు పలు సందర్భాల్లో చేసిన విశ్లేషణలు. ఇక, ఇప్పుడు సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటింది. రానున్న ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు. కరోనా - ఆర్దిక కష్టాలు - రాజకీయ ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు - మేనిఫెస్టో హామీలను నెరవేర్చటంలో జగన్ వెనుకడుగు వేయలేదు. కానీ, ఈ మూడేళ్లలో గత రెండు నెలలు మినహా పార్టీ నేతలకు అంతగా సమయం ఇవ్వలేదు.

గ్రౌండ్ రియాల్టీలు వదిలేస్తున్నారా
పూర్తిగా పార్టీ ముఖ్యనేతల సమాచారం పైనే పార్టీ వ్యవహారాల పైన సూచనలు చేసేవారని చెబుతారు. మంత్రులు - ఎమ్మెల్యేలు సైతం జగన్ ను ప్రసన్నం చేసుకుంటే చాలు..ఆయన కష్టంతో అధికారంలోకి వస్తే ఎంజాయ్ చేద్దాం.. లేకపోతే, మనమూ అధికారంలో ఉండమనే భావనతో కనిపిస్తున్నారనే అభిప్రాయం పార్టీలోనే వ్యక్తం అవుతోంది. సీఎం జగన్ ప్రతీ సందర్భంలోనూ 175 సీట్లు ఎందుకు గెలవమంటూ ప్రశ్నిస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమం రాష్ట్రంలో 87 శాతం మంది ప్రజలకు అందుతోందని..వారంతా ఖచ్చితంగా తనకు మద్దతుగా నిలుస్తారని జగన్ పదే పదే చెబుతున్నారు. కానీ, విపక్ష నేతగా నాడు ప్రజలకు..పార్టీ శ్రేణులతో మమేకం అయి అధికారంలోకి వచ్చిన జగన్..ఈ మూడేళ్ల కాలంలో పార్టీ శ్రేణులు - ప్రజలకు తనను కలిసే అవకాశం ఇవ్వలేదు.

వైఎస్సార్ సక్సెస్ ఫార్ములా అదే
నాడు వైఎస్సార్ సక్సెస్ అయింది అక్కడే. ప్రజా వినతులను నిత్యం తీసుకోవటం..వాటికి ఖచ్చితంగా పరిష్కారం చూపటం ద్వారా వారి మనసుల్లో నిలిచిపోయారు. ప్రతీ రోజు పార్టీ నేతలకు సమయం ఇచ్చే వారు. వైసీపీ క్షేత్ర స్థాయిలో బలంగానే ఉన్నా..టీడీపీని తక్కువ అంచనా వేయటానికి లేదు. ఇప్పుడు సీఎం జగన్ వరుసగా ఎమ్మెల్యేలతో మీటింగ్ లు పెడుతున్నారు. ప్రజలతో మమేకం కావాలంటూ.. సీట్ల అంశం పైనా క్లారిటీ ఇస్తున్నారు. ఇదే సమయంలో ఒక్క నియోజకవర్గం నుంచి 50 మందిని ఎంపిక చేసి వారితో సమావేశం కావాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఇక..చంద్రబాబు - లోకేష్ - పవన్ కళ్యాణ్ యాత్రల పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు. ఇక సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ దాడి మొదలు పెట్టనున్నారు.

జగన్ రావాలి..జగన్ వినాలి
క్షేత్ర స్థాయిలో పార్టీలో ఉన్న సమస్యలు.. ప్రజాభిప్రాయం గురించి పార్టీ నేతలు మాత్రం ఫీల్ గుడ్ రిపోర్టులు ఇస్తున్నట్లు కేడర్ లో ప్రచారం సాగుతోంది. సీఎం జగన్ జిల్లాల పర్యటనలు చేయాలి.. నేరుగా ప్రజలు - నియోజవకర్గాల వారీ సమీక్షలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లాల్లో పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్న డిమాండ్ కమ్ సూచన. 2017-19 నాటి కసి - పట్టుదల జగన్ లో మరోసారి చూడాలనేది వారి ఆకాంక్షగా స్వయంగా చెబుతున్నారు. తన సంక్షేమ పథకాలతో అధికారం ఖాయమని వైసీపీ.. జగన్ పాలనపైన వ్యతిరేకత వచ్చేసిందని, తమదే అధికారమని టీడీపీ అంచనాలతో ఉన్నాయి. కానీ, ఇద్దరికీ ఇప్పటి వరకు ఓటరు నాడి పైన స్పష్టత లేదనేది వాస్తవం. మరి..ఇప్పటికైనా సీఎం గ్రౌండ్ లోకి దిగుతారా.. ఇంకా వెయిట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications