నాడు కృష్ణా..నేడు గోదావరి: పోటెత్తిన నదిలో బోటింగ్ కు అనుమతి ఎవరిచ్చారు?: ప్రభుత్వం మారినా..!
అమరావతి: సరిగ్గా ఏడాది కిందట.. కృష్ణానదిలో ఫెర్రీ మునిగిపోయిన ఘటనలో సుమారు 19 మంది జలసమాధి అయ్యారు. కృష్ణానది ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో బోటింగ్ కోసం అనుమతి ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. అధికారులు పట్టించుకోలేదు. ప్రైవేటు ఆపరేటర్ల కక్కుర్తికి ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 2017 నవంబర్ 12వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన నుంచి ప్రభుత్వం గానీ, అధికారులు గానీ.. ఎలాంటి పాఠాలను నేర్చుకోలేదనే విషయం మరోసారి నిరూపితమైంది. అయిదు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటితో గోదావరి ఉరకలెత్తుతున్నప్పటికీ.. బోటింగ్ కు అనుమతి ఇచ్చారు పర్యాటక శాఖ అధికారులు. దీని ఫలితం- మరికొంతమంది ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది.
గోదావరిలో లాంచీ మునక.. 47 మంది గల్లంతు..! సీఎం ఆరా
సామర్థ్యానికి మించి పర్యాటకులకు అనుమతి..
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదాావరి నీటిలో బోల్తా పడిన రాయల్ వశిష్ఠ లాంచీలో సామర్థ్యానికి మించిన పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తేలింది. గరిష్ఠంగా 35 మంది పర్యాటకులను తీసుకెళ్లాల్సిన లాంచీలో 50 మందిని ఎక్కించుకున్నారు. మరో 11 మంది లాంచీ సిబ్బంది దీనికి అదనం. మొత్తంగా 61 మంది పర్యాటకులతో గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండల వైపు ప్రయాణమైన రాయల్ వశిష్ఠ లాంచీ.. తన గమ్యానికి చేరుకోలేకపోయింది. కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైంది. వారిలో 20 మంది సురక్షితంగా కచ్చులూరు సమీపంలో ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారి పరిస్థితేమిటనేది తేలాల్సి ఉంది. సుమారు 40 మంది వరకు గల్లంతైనట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. లాంచీలో ప్రయాణిస్తున్న సమయంలో లైఫ్ బోట్లను ధరించిన ప్రయాణికులను జాతీయ విపత్తు నిర్వహణ దళ సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
బోటింగ్ పై నిషేధం ఎత్తేసిన వెంటనే ఘటన..
ఈ వర్షాకాల సీజన్ లో అటు కృష్ణా, ఇటు గోదావరి నదులు రెండూ ఉరకలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ ఒక్క సీజన్ లోనే రెండుసార్లు ఈ రెండు నదులకు వరద సంభవించింది. గోదావరి నదికి వరద పోటు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..పర్యాటక శాఖ అధికారులు బోటింగ్ ను నిషేధించారు. వరద తగ్గుముఖం పట్టిన తరువాత బోటింగ్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోదావరిలో అయిదు నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. అయినప్పటికీ.. వారాంతపు రోజులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆపరేటర్లు బోటింగ్ కు తెర తీసినట్లు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో బోటింగ్ ను నిర్వహించి, పెద్ద ఎత్తున డబ్బులను తమ జేబుల్లోకి నింపుకోవాలనే ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా బోటింగ్ చేపట్టినట్లు తెలుస్తోంది. దీనికి పర్యాటక శాఖ అధికారుల అనుమతి ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు.
నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రైవేటు ఆపరేటర్ల దురాగతం..
సాధారణంగా గోదావరి నదిలో పాపికొండల మధ్య లాంచీ ప్రయాణం సాగించడానికి పర్యాటకులు ఇష్టపడుతుంటారు. పాపికొండల మధ్య గోదావరి ప్రయాణానానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం గోదావరి నిండుకుండలా ప్రవహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బోటింగ్ నిర్వహించడం రిస్క్ తో కూడుకున్న పని. గోదావరికి వరద సంభవించినప్పటి నుంచీ బోటింగ్ పై నిషేధం కొనసాగుతోంది. దీనివల్ల తమకు కలిగిన ఆర్థిక పరమైన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రైవేటు ఆపరేటర్లు బోటింగ్ ను చేపట్టినట్లు చెబుతున్నారు. బోటింగ్ కు తూర్పు గోదావరి జిల్లా పర్యాటక సంస్థ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారని తెలుస్తోంది. అయిదు నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవహిస్తున్న సమయంలో బోటింగ్ నిర్వహించడం ఎంత ప్రమాదకరమో అధికారులకు గానీ, ప్రైవేటు ఆపరేటర్లకు గానీ తెలుసు.
బోటింగ్ కు అనుమతి ఎవరిచ్చారు?
అయినప్పటికీ.. పర్యాటకుల నుంచి డబ్బులను దండుకోవడానికి వారు ఈ సాహసానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు యజమానిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇంకా ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్, తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సహా పలువురు అధికారులు కచులూరుకు బయలుదేరి వెళ్లారు.