కిరణ్కి కొత్తకాదు: టిపై డిగ్గీ కౌంటర్, అన్నీతెలుసని జానా
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లులో తప్పులున్నాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం కొత్తేమీ కాదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఆదివారం అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి మధ్యాహ్నం దిగ్విజయ్ను కలిశారు.
ఈ సందర్భంగా డిగ్గీ విలేకరులతో మాట్లాడారు. శాసన సభలో ఎనబై శాతానికి పైగా ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లుపై చర్చలో పాల్గొన్నారని, ఇది శుభ పరిణామమని చెప్పారు. చర్చలో పాల్గొన్న వారందరికీ డిగ్గీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు పలువురు ముసాయిదా బిల్లు పైన శాసన సభలో మాట్లాడారని తెలిపారు.

రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి సభాపతికి నోటీసు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై సభాపతి నాదెండ్ల మనోహర్, బిఏసి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న అంశాలు బిల్లులో ఉంటే సరిదిద్దేందుకు అవకాశముందని చెప్పారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక మార్గదర్శకాలు ఏమీ లేవని చెప్పారు. రాష్ట్రం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. పాతవాళ్లనే కొనసాగించాలనే నిబంధన ఏదీ లేదన్నారు. అభ్యర్థులపై పార్టీలో చర్చ జరుగుతోందన్నారు.
డిగ్గీకి అన్నీ తెలుసు: జానా
తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన డిగ్గీకి ఫిర్యాదు చేయలేదని, ఎలాంటి నివేదిక ఇవ్వలేదని జానా రెడ్డి చెప్పారు. దిగ్విజయ్కి అన్ని విషయాలు తెలుసునని చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లును కేవలం అభిప్రాయం కోసమే పంపించారని, తీర్మానం, ఓటింగ్ ఉండదని జానా చెప్పారు.
సభాపతికి టి మంత్రుల లేఖ
మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు సభాపతికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి తమకు తెలియకుండానే తీర్మానం కోసం లేఖ రాశారని, దానిని పరిగణలోకి తీసుకోవద్దని కోరారు.












Click it and Unblock the Notifications