ముగ్గురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 60 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలను, ఎర్రచందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం చిత్తూరు పోలీస్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన వౌల (40), కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాకు చెందిన సతీష్కుమార్ (38), బెంగళూరుకు చెందిన సిషార్ అహ్మద్ (42) అనే ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను తనిఖీలలో భాగంగా బంగారుపాళ్యం, మదనపల్లి, కల్లూరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
అదేవిధంగా తమిళనాడు, బెంగళూరుకు చెందిన మురుగన్ (32), దేవన్ (36), రాజేంద్రన్ (35) అనే అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను, శశికుమార్, మణికంఠ అనే ఇద్దరు సహాయకులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అంతర్జాతీయ స్మగ్లర్లు వౌల, సతీష్కుమార్, నిషార్ అహ్మద్లు చైనా, దుబాయ్, హాంకాంగ్ తదితర దేశాలకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి వందల కోట్ల రూపాయలు గడించినట్లు ఎస్పీ తెలిపారు.