27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు - సీఎం జగన్ హాజరు..!!
ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27వ తేదిన ప్రారంభం కానున్నాయి. తొలి రోజునే రాత్రి 7 గంటలకు ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహన సేవలో సియం జగన్ పాల్గోంటారని.. సెప్టెంబర్ 28వ తేదిన ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నూతన పరకామణి మండపాన్ని ప్రారంభిస్తారని ఆలయ ఈవో ధర్మారెడ్డి వివరించారు.
టీటీడీ తాజాగా రూ 23 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాని నిర్మించింది. పరకామణి మండపాన్ని ప్రారంభించిన తరువాత ఆలయంలో నిర్వహిస్తన్న పరకామణిని తరలిస్తామని ధర్మారెడ్డి వివరించారు. ఆ ప్రాంతాన్ని భక్తులకు అనువుగా మారుస్తామని తెలిపారు. ఇక, తిరుమల కొండ పైన భక్తు సంఖ్య భారీగా ఉంటోంది. కరోనా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత ఐదారు నెలలుగా భక్తుల తాకిడి ఎక్కువయింది.

లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. గత నెల ఆగస్టు మాసంలో 22.22 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. హుండి ద్వారా 140.34 కోట్ల ఆదాయం లభించినట్లు కూడా అధికారులు తెలిపారు. కోటి 5 లక్షల లడ్డూలను అమ్మినట్లు, 47.76 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications