తిరుమల లడ్డూ వ్యవహారంలో సూపర్ ట్విస్ట్: రంగంలో సిట్
Tirumala Laddu row: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం మరో మలుపు తిరుగింది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా, స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనెను కల్తీ చేసినట్లు వస్తోన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలు కానుంది.
చంద్రబాబే ఆరోపణలు చెయ్యడం..
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

సీబీఐ అడిగితే..
ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తోన్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, అలాంటప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోన్నారు.
సిట్కు సై..
సీబీఐకి బదులుగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఇదివరకే నిర్ణయించింది.
సర్వశ్రేష్ఠ త్రిపాటి..
సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి సారథ్యం వహిస్తారని గతంలోనే ప్రకటించింది. మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వీ హర్షవర్ధన్ రాజును ఇందులో నియమించింది.
మరో ఆరుమంది..
తాజాగా ఈ సిట్లో మరో ఆరుమందిని సభ్యులుగా అపాయింట్ అయ్యారు. తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకట్ రావు, డిప్యూటీ ఎస్పీలు జీ సీతారామ రావు, జే శివనారాయణ స్వామి, అన్నమయ్య రాయచోటి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టీ సత్యనారాయణ, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కే ఉమా మహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఎం సూర్యనారాయణ ఇందులో నియమితులు అయ్యారు.

ఏఆర్ ఫుడ్స్..
ప్రధానంగా- తమిళనాడులోని దిండిగల్లో గల ఏఆర్ డెయిరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ తన దర్యాప్తు మొదలు పెట్టింది. ఏఆర్ ఫుడ్స్పై టీటీడీ అధికారులు ఇదివరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
సెక్షన్లు ఇవే..
టీటీడీ జనరల్ మేనేజర్ మురళీ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాసిరకం, కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినందుకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 274, 275, 326, 318 (3), 318 (4), 61 (2), 299, 494, ఆహార భద్రత చట్టం- 2006లోని సెక్షన్లు 51, 59 కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications