జగన్ డిక్లరేషన్ వివాదంపై హైకోర్టు ఏం చెప్పింది?
Tirumala Laddu row: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది వైఎస్ఆర్సీపీ.
ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పార్టీ క్యాడర్కు ఆదేశాలను ఇచ్చింది. తిరుమల, శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవహరిస్తోన్నారంటూ మండిపడింది.

చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ క్యాడర్కు సూచించారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి సేవలో పాల్గొనబోతోన్నారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు జగన్. రాత్రి అక్కడే బస చేస్తారు.
శనివారం ఉదయం 10:30 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. గంట పాటు అక్కడే ఉంటారు. 11:50 నిమిషాలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2:40 నిమిషాలకు బెంగళూరు ఇంటికి చేరుకుంటారు.
జగన్ తిరుమల పర్యటన వేళ.. డిక్లరేషన్ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున దీనిపై రాజకీయ రచ్చ సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. డిక్లరేషన్పై సంతకం పెట్టి తీరాల్సిందేనంటూ పట్టుబట్టుతున్నారు.
ఈ పరిస్థితుల మధ్య ఏపీ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పు ఒకటి వార్తల్లోకెక్కింది. 2020 నాటి తీర్పు ఇది. ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించడానికి వెళ్లిన సమయంలో వైఎస్ జగన్.. తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయలేదని, ఆయనను నియంత్రించాలంటూ దాఖలైన పిటీషన్ను అప్పట్లో కొట్టివేసింది హైకోర్టు.
జగన్కు క్రైస్తవుడని, టీటీడీ నిబంధనల ప్రకారం ఎవరు అన్యమతస్తులు ఎవరు తిరుమలకు వెళ్లినా డిక్లరేషన్పై సంతకం పెట్టాల్సి ఉంటుందంటూ అప్పట్లో గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు పిటీషన్ వేశారు. జగన్ అన్యమతస్తుడని, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాడంటూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున హైకోర్టు కొట్టివేసింది.
క్రైస్తవ సువర్త మహాసభలు, చర్చిలో ప్రార్థనలకు హాజరైనంత మాత్రాన ఒకవ్యక్తిని క్రైస్తవుడిగా పరిగణించలేమంటూ జస్టిస్ బట్టు దేవానంద్తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. టీటీడీ ఆహ్వానం మేరకే ఆయన తిరుమల వెళ్లారని, రాష్ట్ర ప్రజల తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడానికి వెళ్లినందున జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సన అవసరం లేదని తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications