టీటీడీలో బయటపడ్డ రూ. 100 కోట్ల స్కాం..మీరు దేవుడిని కూడా వదల్లేదా..?
తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. హైకోర్టు నిందితుడు రవికుమార్పై నమోదైన అభియోగాలను కొట్టివేయగా, లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నుంచి రూ. 100 కోట్లు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ జరిగిందని, ఇది ఒక పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.

అప్పటి ప్రభుత్వ పెద్దలు స్వామివారి పేరుతో రూ. 40 కోట్ల విలువైన ఆస్తులను కూడా రాయించుకున్నారని ఆయన బాంబు పేల్చారు.ఈ స్కామ్ను రాజీ చేయడానికి అప్పటి అధికారులు ఎందుకు ఒప్పుకున్నారని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ విజిలెన్స్ నివేదికలో పోలీసుల ఒత్తిడి వల్లే రాజీ చేసుకున్నామని పేర్కొన్నారని, ఆ ఒత్తిడి తెచ్చిన పోలీసు అధికారి ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణ మొదలైతే, ఈ కుంభకోణంలో ఉన్న నిజాలు, అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర, పోలీసుల ఒత్తిడి వంటి అనేక అంశాలు బయటకు వస్తాయని భానుప్రకాశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ రాజకీయంగా కూడా కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications