జూన్ 18 నుంచి జులై 9 వరకు అమెరికాలో తిరుమల శ్రీనివాసుడి కల్యాణాలు
అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన ఈవో ధర్మారెడ్డి తో కలసి మీడియాతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అమెరికాలోని భక్తుల కోసం శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రవాస భారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు జరగనున్నాయన్నారు.
జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగోలో, జులై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డీసీ, 9వ తేదీన అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీనివాసుని కళ్యాణాలు నిర్వహించాలని భక్తులు విజ్ఞప్తులు చేశారని, వారి విజ్ఞప్తులను కూడా పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం భారీగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హిందూ ధర్మంవైపు అందరూ ఆకర్షితులవుతున్నారని, ఇందులో ఉన్న ఫ్లెక్సిబిలిటీయే అందుకు కారణమన్నారు. అమెరికాలో కల్యాణాలు నిర్వహించడం అయిపోయిన తర్వాత ఎక్కడ నిర్వహించాలనేది, ఏయే దేశాల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయనేది నిర్ణయించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.