జనసేనాని పవన్తో తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ భేటీ... ఎన్నికల వ్యూహంపై చర్చ...
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు. శుక్రవారం(మార్చి 26) హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్బంగా తిరుపతి ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై రత్నప్రభ పవన్ కల్యాణ్తో చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి లోక్సభ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారాన్ని వివరిస్తూ ఇప్పటికే ఓ వీడియోను విడుదల చేసినట్లు బీజేపీ నేతలు ఈ సమావేశంలో పవన్కు వెల్లడించారు. ఉపఎన్నికలో వైసీపీని గెలిపిస్తే వారి సిట్టింగ్ స్థానం వారికే దక్కుతుందని... టీడీపీని గెలిపిస్తే వారికి ఒక సీటు వస్తుందని... అదే బీజేపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే కచ్చితంగా కేంద్రం తిరుపతిని మరింత అభివృద్ది చేస్తుందని ప్రజలకు వివరించాలని బీజేపీ-జనసేన నేతలు నిర్ణయించారు.
నిజానికి తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలి పంచాయతీ,మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ కన్నా కాస్తా కూస్తో జనసేన ఫర్వాలేదనిపించడంతో ఆ సీటు జనసేనకే ఇవ్వడమే సబబు అన్న వాదన వినిపించింది. కానీ పొత్తు ధర్మంలో భాగంగా తిరుపతి సీటును జనసేన బీజేపీకి త్యాగం చేయక తప్పలేదు. అయితే తిరుపతి టికెట్ త్యాగానికి ప్రతిఫలంగా తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీకి బీజేపీ జనసేనకు అవకాశం ఇవ్వవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన నాగార్జునసాగర్ నియోజకవర్గ కమిటీని ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. అటు తిరుపతి,ఇటు నాగార్జునసాగర్ రెండు ఉపఎన్నికలు ఏప్రిల్ 17న జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడి అవుతాయి.