తిరుపతికి చంద్రబాబు: టీటీడీ అధికారులతో సమీక్ష
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తొక్కిసలాట ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలంటూ ఆదేశించారు.

ఈ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు. మృతుల కుటుంబాల వారిని కలుస్తారు. వారిని ఓదార్చనున్నారు. రూయా, శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు.
ఈ ఉదయం ఉండవల్లి నివాసం నుండి 11 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరుతారు. 11:10 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, 11:15 నిమిషాలకు విమానంలో తిరుపతికి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12:00 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి నేరుగా రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు వెళ్తారు. క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3:45 నిమిషాలకు గన్నవరం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
దుర్ఘటన చోటు చేసుకున్న తరువాత చంద్రబాబు హుటాహుటిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, పోలీస్ సూపరింటెండెంట్ సుబ్బారాయుడు, టీటీడీకి చెందిన ఇతర అధికారులతో మాట్లాడారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications