తొక్కిసలాట తరువాత తిరుపతి కౌంటర్ల పరిస్థితి ఎలా ఉందంటే..: కోటా పూర్తి?
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

ఈ తొక్కిసలాట ఘటన పట్ల తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక టోకెన్ కౌంటర్ వద్ద భక్తులకు భద్రతను కల్పించదానికి చాలినంత మంది పోలీసులను విధి నిర్వహణలో మోహరింపజేశామని, టీటీడీ, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని వివరించారు.
తొక్కిసలాట తరువాత తిరుపతిలో గల అన్ని కౌంటర్లలోనూ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల జారీ శరవేగంగా కొనసాగింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకూ టికెట్లను జారీ చేశారు టీటీడీ ఉద్యోగులు. మళ్లీ ఈ తెల్లవారు జామున అయిదు గంటలకు కౌంటర్లను తెరిచారు. టికెట్ల జారీని కొనసాగించారు.

ఉదయం 10- 11 గంటల సమయానికి టికెట్ల పంపిణీ ముగిసింది. మొత్తం లక్షా 20 వేల సర్వదర్శనం టోకెన్లను టీటీడీ సిబ్బంది భక్తులకు అందజేశారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఉద్దేశించిన టోకెన్లు ఇవి. తిరుపతిలో గల ఎనిమిది కేంద్రాల్లో 87 కౌంటర్ల ద్వారా వాటిని అందించారు.
13 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఒక్కరోజు ముందు భక్తులకు అందజేస్తారు. ఈ టోకెన్లు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణువాసం, భూదేవి కాంప్లెక్స్లల్లో ఏరోజుకారోజు ఇస్తారు.












Click it and Unblock the Notifications