టీటీడీ చరిత్రలో చీకటిరోజు: పాపం మూట గట్టుకున్నారు
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
ఘాటుగా స్పందించిన భూమన..
ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తోన్న కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటకు చంద్రబాు ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. ఈ ఘటనలో భక్తులు మరణించడం, గాయాలపాలు కావడం తీవ్ర విచారకరమని చెప్పారు.

చిత్తశుద్ధిలేని వాళ్లు, వివాదాస్పదులకు..
చిత్తశుద్ధిలేని వాళ్లు, వివాదాస్పదులకు టీటీడీ పగ్గాలు ఇవ్వడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని భూమన ధ్వజమెత్తారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులు భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రత దెబ్బ..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి.. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసిందని విమర్శించారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ వాడుకున్నారని భూమన ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు..
తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు తొక్కసలాటకు గురికావడం, మరణించడం సాధారణమైన విషయం కాదని, టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజు అని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని విమర్శించారు.
ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవు..
ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ చేదు జ్ఞాపకమేనని భూమన అన్నారు. హిందూ ధర్మం మీద భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటోన్నాయని చెప్పారు. భక్తులకు అందించే సేవలు అత్యంత పవిత్రమైనవని, వాటిని తేలిగ్గా చూడటం వల్లే ఇలాంటి పదే పదే జరుగుతున్నాయని అన్నారు.
లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసు..
పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసునని, అయినా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని భూమిన ప్రశ్నించారు. తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసుల పైనే ఉందని, వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపైనే వారి దృష్టి ఉందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లేదు..
తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లేదని, శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ ఛైర్మన్కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువయ్యాయని, ఆయన పనంతా రాజకీయ దుష్ప్రచారం చేయడమేనని విమర్శించారు.
శ్రీవారి భక్తులకు క్షమాపణ..
టీటీడీ ఛైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టికెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని, టీటీడీ ఛైర్మన్ సహా, స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అసమర్థ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications