"రోజా!.. బీరు మీద ప్రేమైతే నాలుగు గోడల మధ్య చూసుకో!"
ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న రోజా.. నోరు తెరిస్తే బారు, బీరు అన్నపదం తప్ప.. ఆమెకు వేరే మాటలు రావడంలేదని పుష్పావతి అన్నారు.
తిరుపతి: ఇళ్ల మధ్యలోనే మద్యం దుకాణాలు తెరుచుకోవడం పట్ల ఏపీలో మహిళా లోకం భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో మహిళలు మద్యం షాపులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. వీటికి సంబంధించిన అనుమతుల విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా.. ప్రతిపక్షం వైసీపీ సైతం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది.
బాబుది 'నీరు-బారు', ఇక ఎర్ర చంద్రమనే పిలవాలా?: రోజా సెటైర్లు
ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే రోజా.. నీరు-మీరు కార్యక్రమంలా ప్రభుత్వం నీరు-బారు కార్యక్రమం చేపట్టిందని ఎద్దేవా చేశారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ మహిళా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ మహిళా లోకం మొత్తాన్ని విమర్శించేదిగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పుష్పావతి నేతృత్వంలో తిరుపతిలో ఆ పార్టీ మహిళలు భారీ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రోజా దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న రోజా.. నోరు తెరిస్తే బారు, బీరు అన్నపదం తప్ప.. ఆమెకు వేరే మాటలు రావడంలేదని పుష్పావతి అన్నారు. రోజాకు బారు-బీరు మీద అంత ప్రేమ ఉంటే ఆ వ్యవహారమేదో నాలుగు గోడల మధ్య చూసుకోవాలని ఎద్దేవా చేశారు.