అచ్చెన్నకు జగన్ మార్క్ ట్రీట్ మెంట్: నాటి అవమానాలకు ఇదే సమాధానమా: అత్యంత సీక్రెట్గా..!
జగన్ ప్రభుత్వంలో టీడీపీకి తొలి షాక్..ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల ద్వారానే జలక్ ఇస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా చంద్రబాబు కుడిభుజాన్ని అరెస్టు చేసి ఊహించని షాకిచ్చింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కామ్లో ఏపీ ఎసీబీ అరెస్టు చేసింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ ఖంగుతింది. అచ్చెన్న అరెస్టు సమాచారం ముఖ్యమంత్రి మినహా మరెవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా ఆపరేషన్ పూర్తి చేశారు.
అయితే అచ్చెన్న ఈఎస్ఐ స్కామ్లో పాత్రధారుడిగా ఆధారాలున్నా అరెస్టు వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పే నైజం ముఖ్యమంత్రి జగన్ది. అచ్చెన్నాయుడును ఇలానే ఫిక్స్ చేశారా..?

అదను చూసి ఫిక్స్ చేసిన జగన్
ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో శాసనసభ లోపలా బయటా అచ్చెన్నాయుడు జగన్ టార్గెట్గా ఒంటికాలుపై లేచేవారు. తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో ఛాలెంజ్లు విసిరారు. వాటన్నిటికీ సమాధానంగా ముఖ్యమంత్రి జగన్ అదను చూసి తప్పించుకోలేని విధంగా ఫిక్స్ చేసి మరీ బలమైన దెబ్బ తీశారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన షాక్తో వైసీపీ నేతల్లోనే ఆసక్తికర చర్చ మొదలైంది. జగన్ పై విరుచుకుపడే అచ్చెన్నాయుడు... వైసీపీ ఏర్పాటు నుండి ప్రతి సందర్భంలోనూ టీడీపీ జగన్ను టార్గెట్ చేస్తూనే ఉంది. అందులో అచ్చెన్నాయుడు కీరోల్ తీసుకునేవారు. చంద్రబాబు మెప్పు కోసం కావొచ్చు లేదా.. లీడర్గా ప్రొజెక్ట్ అవ్వడం కోసం జగన్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఒక దశలో జగన్ పార్టీ పెట్టిన కొత్తలో అచ్చెన్నాయుడును సైతం వైసీపీలోకి తీసుకొచ్చేందుకు అచ్చెన్నతో సన్నిహితంగా మెలిగిన శోభానాగిరెడ్డి రాయబారం నడిపారు. అయితే అచ్చెన్నా తటపటాయించి పార్టీ మారలేనని తేల్చేశారు.

అంతా రహస్యంగానే...
జగన్ అక్రమాస్తుల కేసులపై అచ్చెన్నాయుడు 2019 ఎన్నికల వరకు పలుమార్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక శాసనసభలో జగన్ పైన దూషణలకు దిగడం కోసమే చంద్రబాబు అచ్చెన్నాయుడిని ప్రయోగించేవారు. వైసీపీ నేతలు రోజా మొదలు పలువురు సభ్యులు చివరకు జగన్ సైతం అచ్చెన్న పైన ప్రతిదాడి చేసేవారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఉపనేతగా అచ్చెన్నాయుడు ఆపార్టీలో కీలకంగా మారారు. అయితే మునుపటి తరహాలో కాకుండా కొంత వేగం తగ్గించినా ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం కొనసాగించారు. ఆసమయంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ను అవమానించిన వారంతా ఓడిపోయారని అచ్చెన్న మాత్రమే తప్పించుకుని గెలిచి సభకు వచ్చారని వైసీపీ నేతలు ఓపెన్గానే వ్యాఖ్యానించారు. అయితే అప్పటికే అచ్చెన్నాయుడిపైన ఈఎస్ఐ కుంభకోణ విచారణ ప్రారంభమైంది. ఆయన దొరకడం ఖాయమని అప్పట్లోనే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయం అచ్చెన్నాయుడుకు సైతం తెలిసిందే. ఈ కేసు మొత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ పర్యవేక్షించడంతో వారు నేరుగా సీఎంకే ప్రతి డెవలప్మెంట్ నివేదిస్తూ వచ్చారు. చివరకు అచ్చెన్న అరెస్టు విషయం ముఖ్యమంత్రి జగన్, ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులుకు తప్ప మంత్రులకు సైతం సమాచారం లేదు. అంచనా కూడా వేయలేకపోయారు.

జగన్ వర్సెస్ అచ్చెన్న ఛాలెంజ్లు
జగన్ ప్రతిపక్షనేతగా శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన అనేస సందర్భాల్లో అచ్చెన్నాయుడు అడ్డుతగిలేవారు. జగన్ రూ.43వేల కోట్లు దోచుకున్నారంటూ పలుమార్లు ఆరోపణలు చేశారు. దానికి జగన్ సైతం తీవ్రంగానే స్పందించారు. తాను అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని లేకుంటే అచ్చెన్న రాజీనామా చేయాలని అప్పట్లోనే డిమాండ్ చేశారు. అదే విధంగా ఓటుకు నోటు కేసులో కీలకమైన ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ జగన్ బంధువని, జగన్ ఇచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగానే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటూ అచ్చెన్న తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ జగన్ల మధ్య హాట్లైన్ సంబంధం ఉందంటూ చెలరేగారు. దానికి స్పందనగా జగన్ తీవ్ర ఆవేశంతో ఊగిపోతు నిరూపించమంటూ సవాల్ చేశారు. జగన్ 10వ తరగతి చదివే సమయంలోనే కొశ్చన్ పేపర్లను లీక్ చేశారని అది హైదరాబాదులో కేసు కూడా నమోదైందని తీవ్ర ఆరోపణలకు దిగారు. జగన్ పైన అనేక సందర్భాల్లో వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అదును చూసి ఊహించని దెబ్బ కొట్టారు.
Recommended Video

చంద్రబాబుకు భారీ నష్టం
శాసనసభలో చంద్రబాబుకు అచ్చెన్నాయుడు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పక్కసీటులో కూర్చొన్న అచ్చెన్నను అక్కడి నుంచి మార్చి అది గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. ప్రస్తుతం టీడీపీ నుంచి వలసలు పెరుగుతున్న క్రమం, పార్టీ బలహీనపడుతున్న సమయంలో మరింత బలంగా దెబ్బకొట్టాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడుగా రామ్మోహన్నాయుడు పేరు ప్రచారంలో ఉన్న వేళ ఆయన సొంత బాబాయ్ అచ్చెన్నాయుడుని అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టాలనేది జగన్ వ్యూహం. మరో నాలుగు రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతుండటం ఉత్తరాంధ్రలో టీడీపీకి కీలక నేత కావడం తనపైన రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేయడం చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో సీఎం జగన్ ఇప్పుడు అచ్చెన్నాయుడుని టార్గెట్ చేశారు. దీంతో టీడీపీ నేతల్లో అలజడి అయోమయం మొదలయ్యాయి. జగన్ టార్గెట్లో నెక్ట్స్ ఎవరనే చర్చ మొదలైంది. వైసీపీ నేతలు మాత్రం ఇది జగన్ మార్క్ పాలిటిక్స్ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications