సినిమా టికెట్ల ధరల వివాదంలో టాలీవుడ్ చివరి అస్త్రం: మోహన్ బాబుతో రాయబారం: వైఎస్ జగన్కు లేఖ
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- తెలుగు చలన చిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదం ఇంకా సద్దుమణగట్లేదు. సంక్రాంతి సీజన్ మొదలైనందున- కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ వెనక్కి వెళ్లినప్పటికీ- రాధేశ్యామ్, భీమ్లా నాయక్, బంగార్రాజు- సోగ్గాడు మళ్లీ వచ్చాడుతో సహా చిన్న సినిమా డీజే టిల్లు విడుదల కాబోతోన్నాయి.

భారీ బడ్జెట్ సినిమాలు..
డీజే టిల్లు మినహాయిస్తే.. మిగిలిన వన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నవే. ప్రత్యేకించి- రాధేశ్యామ్. పాన్ ఇండియా సూపర్ స్టార్ గుర్తింపును పొందిన ప్రభాస్-పూజా హెగ్డే నటించిన ఈ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయల పైమాటే. ఏపీ పెద్ద మార్కెట్. అసలే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆంక్షల మధ్య థియేటర్లు నడుస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీలకు దెబ్బ..
పాన్ ఇండియా సినిమాలకు పెద్ద మార్కెట్గా భావించే ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీల్లో ఒమిక్రాన్ ఆంక్షలు కఠినంగా అమల్లో ఉంటున్నాయి. థియేటర్లు 50 శాతం కెపాసిటీతోనే నడుస్తోన్నాయి. బెంగళూరులో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే సినిమా హాళ్లల్లో ఎంట్రీ ఉంది. ఈ పరిస్థితుల మధ్య భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాబోతోండటం ఓ సాహసంగానే చెప్పుకోవచ్చు. ఆ సాహసానికి పూనుకోలేకపోవడం వల్లే ట్రిపుల్ ఆర్ వెనక్కి వెళ్లింది.

ఏపీలో టికెట్ల రేట్లను పెంచుకోగలిగితే కొంత ఊరట
అదే సమయంలో- ఏపీలో సినిమా టికెట్ల రేట్లను జగన్ సర్కార్ తగ్గించడం.. కలెక్షన్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొని ఉంది. ఇప్పుడున్న ఆంక్షలకు తోడు ఏపీలో సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల వచ్చే కలెక్షన్లు భారీగా తగ్గుతాయనని ఇండస్ట్రీ బిగ్షాట్స్ అనుమానిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో- మరోసారి జగన్ సర్కార్తో సంప్రదింపులు నిర్వహించడానికి సమాయాత్తమౌతున్నాయి. టికెట్ల రేట్లను పెంచుకోవడం వల్ల నార్త్లో వచ్చే నష్టాన్ని ఇక్కడ పూడ్చుకోవచ్చనే అభిప్రాయం ఉంది.

ప్రత్యామ్నాయంగా మోహన్ బాబు
చిరంజీవి చేతులెత్తేసిన వేళ.. టాలీవుడ్ పెద్దలకు ప్రత్యామ్నాయంగా మోహన్ బాబు కనిపిస్తోన్నారు. ఆయనను బరిలోకి దించే ప్రయత్నం చేస్తోన్నారు. జగన్ సర్కార్తో రాయబారం నడిపించడానికి మోహన్ బాబును తెర మీదికి తీసుకొస్తోన్నారు. దీనికి మోహన్ బాబు సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టికెట్ల రేట్ల విషయంలో జగన్ సర్కార్ మాట్లాడటానికి ఆయన అంగీకరించారనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా సాగుతోంది.

వైఎస్ జగన్కు లేఖ..
ఇందులో భాగంగా- మోహన్ బాబు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖ రాస్తారని అంటున్నారు. విలేకరుల సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి, తాను చెప్పదలచుకున్నది స్పష్టం చేస్తారని చెబుతున్నారు. ఈ మీడియా సమావేశంలోనే మోహన్ బాబు ఈ లేఖను విడుదల చేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం. వైఎస్-మోహన్ బాబు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా మోహన్ బాబుకు గుర్తింపు ఉంది.

వైసీపీ నేతగా..
పైగా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించారు. బలమైన ఆ సామాజిక వర్గం ఓటుబ్యాంకును వైసీపీ వైపు మళ్లింపజేయడంలో సఫలం అయ్యారు. ఇప్పుడు అదే కమ్మ సామాజిక వర్గం తెలుగు చలన చిత్ర పరిశ్రమపై ఆధిపత్యాన్ని వహిస్తోంది. ఆయా కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- సినీ పెద్దలు మోహన్ బాబును రంగంలోకి దింపారని అంటున్నారు.












Click it and Unblock the Notifications