పవన్ కళ్యాణ్ను కలిసేందుకు క్యూ కట్టిన తెలుగు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. సోమవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్కు వివరించనున్నారు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు పవన్కు వివరించనున్నారు.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ని నిర్మాతలు కోరనున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల వంటి విషయాల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల సినీ ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. దీంతో సినిమా ఇండస్ట్రీ జగన్కు వ్యతిరేకంగా పని చేసింది. చాలామంది నటులు, నిర్మాతలు టీడీపీ కూటమికి బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించారు.

ఇప్పుడు కూటమి విజయం సాధించడంతో పాటు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో ఇండస్ట్రీ కష్టాలు కొంతమేర తీరినట్టే అని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగానే టాలీవుడ్ నిర్మాతలు పవన్తో సమావేశం అవ్వడానికి సిద్దమవుతున్నారు. పవన్ కళ్యాణ్ను కలిసే వారిలో అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు,దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు..












Click it and Unblock the Notifications