టొమాటోను ఇలాక్కూడా అమ్మటం మొదలు పెట్టేశారు బాబోయ్: చికెన్ ధరలతో పోటీ
అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాల దెబ్బకు కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దిగిరావట్లేదు. వేలాది హెక్టార్లలో పంట ధ్వంసం కావడం వల్ల.. మార్కెట్లో నెలకొన్న రోజువారీ డిమాండ్కు అనుగుణంగా కూరగాయలు సరఫరా కావట్లేదు. డిమాండ్ అండ్ సప్లై చెయిన్ అనేది ఇక్కడ దెబ్బతింది. ఫలితంగా- వాటి రేట్లు మహా భయానకంగా పెరిగాయి..పెరుగుతున్నాయి. కూరగాయల్లో తప్పనిసరిగా వినియోగించాల్సిన టొమాటో ధర కిలో ఒక్కింటికి వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. 150 రూపాయలకు చేరువ అవుతోంది.
ఆఫ్ఘనిస్తాన్లో కీలక పరిణామాలు: ఇక పూర్తిస్థాయిలో..27 మందితో
ఉల్లిని మించి..
సాధారణంగా వర్షాకాలంలో ఉల్లిపాయల రేట్లు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఆకాశాన్నంటుతుంటాయి. గత సీజన్లో పలువురు రైతులను లక్షాధికారులను చేసిన ఉల్లిపంట. కొన్ని రోజుల పాటు కిలో ఒక్కింటికి 100 రూపాయలకు పైగా స్థిరంగా కొనసాగింది వాటి రేట్లు. ఇప్పుడు ఈ డ్యూటీని టొమాటో తీసుకుంది. కిలో టొమాటో రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. కొన్ని రకాల కూరగాయలదీ ఇదే పరిస్థితి. ఏపీ, తెలంగాణల్లోనే కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు షాకిస్తున్నాయి.
ధరలు రెట్టింపు..
మార్కెట్లో అడుగు పెడితే కిలో చొప్పున 40 రూపాయలకు దిగువన ఉండే కూరగాయలేవీ కనిపించట్లేదు. బెంచ్ మార్క్ పెట్టుకున్నట్లు కనిపిస్తోన్నాయవి. సాధారణ రోజుల్లో కిలో ఒక్కింటికి 20 రూపాయల లోపు ఉండే చాలా రకాల కూరగాయలు ఇప్పుడు డబుల్ అయ్యాయి. రెట్టింపు ధర పలుకుతున్నాయి. దీనితో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాటి రేట్లు చికెన్ ప్రైస్తో పోటీ పడుతున్నాయి. సంచి నిండా కూరగాయలను కొనలేని పరిస్థితి ఏర్పడిందనేది కొనుగోలుదారుల ఆవేదన.
టొమాటో హెడ్ క్వార్టర్స్లో
టొమాటో మార్కెట్కు హెడ్ క్వార్టర్గా చెప్పుకొనే చిత్తూరు జిల్లా మదనపల్లెలో గత రికార్డులు ఎన్నో చెరిగిపోయాయి. ఎప్పుడూ లేనంతగా కిలో టమాటా 140 రూపాయలు పలికింది. వర్షాల వల్ల పంట దెబ్బతినడం వాటి రేట్లు పెరగడానికి ప్రధాన కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏపీ, తెలంగాణ సహా పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచీ టొమాటోలు ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి. ఆయా రాష్ట్రాలన్నీ భారీ వర్షాలకు కుదేల్ అయినవే. ఫలితంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గింది.
అక్కడ 160 రూపాయలు..
చెన్నైలో గరిష్ఠంగా కిలో టమోటా 160 రూపాయలు పలుకుతోంది. ఇదే పరిస్థితి మిగిలిన నగరాల్లోనూ కనిపిస్తోంది. మధురై, కోయంబత్తూరు, నాగర్ కోయిల్, చెంగల్పట్టు, రామనాథపురం, నాగపట్టిణం.. ఇలా ఒక్కటని తేడా ఉండట్లేదు. తమిళనాడు వ్యాప్తంగా టొమాటోతో పాటు అన్ని రకాల కూరగాయల రేట్లు ఆకాశాన్నంటాయి. కేరళలోని తిరువనంతపురం, కోచి, ఎర్నాకుళం, కోజికోడ్, కన్నూర్ వంటి నగరాల్లో ఈ ఎర్ర బంగారం ధర 120 నుంచి 140 రూపాయలు ఉంటోంది.