విశాఖలోని ప్రైవేట్ స్కూల్ లో తీవ్ర విషాదం.. టీచర్ కొట్టడంతో UKG చిన్నారి మృతి
విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. టీచర్ దెబ్బలను తట్టుకోలేక ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..?
విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ప్రణయ్ తేజ అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే క్లాస్ రూమ్ లో టీచర్ అందరి హోంవర్క్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ తేజను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు బెదిరించారు. దాంతో భయపడిపోయిన ప్రణయ్.. కొట్టొద్దు అంటూ విలపించాడు. అయినా ఆ ఉపాధ్యాయురాలు బాలుడి చెంపపై కొట్టింది. దాంతో బెదిరిపోయిన బాలుడు.. క్లాస్ రూమ్ లోనే స్పృహ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వెంటనే బాలుడ్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
విశాఖలో ఘోరం.. టీచర్ కొట్టడంతో భయపడి, కుప్పకూలి LKG బాలుడు మృతి! #Visakhapatnam #VizagSchoolTragedy #SchoolHorror #ViralWatch #OITelugu pic.twitter.com/tRg5h2BUog
— oneindiatelugu (@oneindiatelugu) August 20, 2026
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు బాలుడు ప్రణయ్ తేజ మృతిపై మంత్రి లోకేశ్ స్పందించారు. టీచర్ కొట్టడంతో చిన్నారి మరణించడం బాధాకరం అని అన్నారు. బాధ్యులు, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రణయ్ తేజ తల్లిదండ్రులకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదాని.. వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేయడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో లోకేశ్ పోస్ట్ పెట్టారు.

ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలికాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు భద్రత కల్పించడం ప్రతి పాఠశాల యాజమాన్యం బాధ్యత అని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకుని కఠిన నిర్ణయాలు అమలు చేయాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications