'పవన్ కళ్యాణ్! పిచ్చి వేషాలు మానుకో, లేదంటే': జనసేనానికి తీవ్ర హెచ్చరిక
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్వార్థ రాజకీయాల కోసం పిచ్చి రాజకీయాలు మానుకోవాలని గిరిజన హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గుర్నాథం హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు ఇచ్చిన హామీని వెంటనే వెనక్కి తీసుకోవాలని గిరిజన హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మంగళవారం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ప్రయాణీకుల బూట్లకు పాలిష్ చేసి నిరసన తెలిపారు.

ఎవరు జిందాబాద్ అంటే వారికి వరాలు
ఈ సందర్భంగా గిరిజన హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుర్నాథం మాట్లాడారు. కులాలు, జాతులు, ఆచార వ్యవహారాలు, స్థితిగతులు తెలియని పవన్ కళ్యాణ్ ఎవరు జిందాబాద్ అంటే వారికి వరాలు ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు.

పిచ్చిపిచ్చి ప్రకటనలు మానుకో
పిచ్చి పిచ్చి ప్రకటనలు ఇవ్వడం పవన్ కళ్యాణ్ మానుకోవాలని హితవు పలికారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇందుకు, తాను మద్దతిస్తానని, ప్రభుత్వంతో చెబుతానని అనడం సరికాదన్నారు. గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో దీనిని బట్టి అర్థమవుతోందన్నారు.

జనసేన ఆగ్రహం చవిచూడక తప్పదు
వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయిస్తే ఆ అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ నడవడం విచారకరమన్నారు. పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గిరిజనుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదన్నారు.

ఇంటిని కూడా ముట్టడిస్తాం
అవసరమైతే తాము పవన్ కళ్యాణ్ ఇంటిని చుట్టుముట్టడానికి కూడా వెనుకాడబోమని ఆయన తెలిపారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని చెప్పడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ వెనక్కి తగ్గాలన్నారు.












Click it and Unblock the Notifications