5రాష్ట్రాలతో తెరాస వెనుకడుగు: టిపై ప్రభావం ఎంత?

కాంగ్రెస్ దేశవ్యాప్తంగా దెబ్బతింటోందని తెలిసిన తర్వాత తెరాస కూడా కాంగ్రెస్తో చేతులు కలిపే అవకాశం లేదని, ఆ పార్టీ స్వతంత్రంగా లేదా బిజెపితో కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినా, ఆ ప్రాంతంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కంటే తెరాసకే ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తున్నారు.
ఎలాగూ తుడిచి పెట్టుకుపోతామని తెలిసినందువల్ల తెరాస విలీనం కాకపోతే విభజనపై తాము ఎందుకు నిర్ణయం తీసుకుని లేని తలనొప్పులు తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావించవచ్చునని చెబుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో కొంత పేరు తెచ్చుకున్నారని, కనీసం ఆయన నాయకత్వంలోనే పార్టీ పోరాడితే ఎన్నో కొన్ని సీట్లు రావచ్చునని పార్టీ నేతలు భావిస్తున్నారంటున్నారు.
ఇక, కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత బిజెపి కూడా తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టే బిల్లును గుడ్డిగా సమర్థించే అవకాశాలు లేవని, తెలంగాణ విషయాన్ని వచ్చే ఎన్నికల తర్వాతే తేల్చుకుందామని చెప్పే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
తెరాస.. కాంగ్రెసు పార్టీతో కలవకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేందుకే ఎక్కువగా మొగ్గు చూపనుందంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తమకు 50 పైగా సీట్లు వస్తాయని తెరాస భావిస్తోంది. కాంగ్రెసు విభజనకు వెనుకడుగు వేస్తే మాత్రం తామే క్లీన్ స్వీప్ చేస్తామని గట్టిగా విశ్వసిస్తోంది. తెరాస, బిజెపిలు ఒంటరి పోరుకు సిద్ధపడుతున్నప్పటికీ ఎన్నికల తర్వాత అలయన్స్గా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో, నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణపై కూడా తమ నిర్ణయాన్ని పార్టీలు సమీక్షించేందుకు దోహదం చేస్తాయంటున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు అధిష్టానంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో పార్టీకి అంతకంటే ఎక్కువ పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications