వారు ఓడుతారు, పవన్ బలుపనుకుంటున్నాడు: హరీష్
మెదక్: తెలంగాణ కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోతారని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం జోస్యం చెప్పారు. తొలి ప్రభుత్వం తమదే అన్నారు. తెరాస గెలుస్తుందన్న అంచనాతోనే లగడపాటి రాజగోపాల్ తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారన్నారు. సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నేతలంతా ఇంటిదారి పట్టక తప్పదన్నారు.
ఒకరిద్దరు మాజీ మంత్రులు మినహా.. పొన్నాల లక్ష్మయ్య సహా మిగిలినవారంతా ఓటమి పాలవడం ఖాయమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వాపును బలుపనుకొని మాట్లాడుతున్నారని, సీమాంధ్రలో వారికి శృంగభంగం తప్పదన్నారు. కెసిఆర్ను తిడితేనే సీమాంధ్రలో ఓట్లు పడుతాయనే భ్రమలో నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఉత్తర తెలంగాణలో టిడిపి తుడిచిపెట్టుకుపోయిందన్నారు.
సీమాంధ్రలో బిజెపి, టిడిపికి అదే పరిస్థితి రానున్నందన్నారు. సొంతంగా ఎన్నడూ చంద్రబాబు ఎన్నికల బరిలో నిలవలేదని ఎద్దేవా చేశారు. కిరణ్ కేబినెట్లోని మంత్రులందరూ దొంగలని, వారిపై సిఐడితో విచారణ జరిపించి తీరుతామని ప్రకటించిన చంద్రబాబు.. అందులోని 20 మంది మంత్రులను టిడిపిలో ఎందుకు చేర్చుకున్నారో చెప్పాలన్నారు.
తెలంగాణలోని రెండు లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు మాత్రమే ఉందని, మిగతా సీట్లన్నీ తెరాస గెలుచుకుంటుందని చెప్పారు. సిఎం అభ్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ నేత కూడా మట్టి కరుస్తున్నాడని చెప్పారు. మెదక్ జిల్లాలో పదింటికి పది అసెంబ్లీ స్థానాలు తెరాస కైవసం చేసుకుంటుందన్నారు. జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు ఖాయమన్నారు.