చంద్రబాబుకు 'తెలంగాణ' హెచ్చరిక, సాగుతున్న షర్మిల
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, పర్యటన ఆలోచన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆయనను హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు పర్యటన విషయమై తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవారం ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన, తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును అవమానించిన చంద్రబాబు తమ రాష్ట్రంలో పర్యటిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునే పరిస్థితి లేదన్నారు.
చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తెలంగాణలో పర్యటించాలనుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే మేం ఏం చేయాలో అది చేస్తామన్నారు. కేసీఆర్ వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించారని, ఇతర జిల్లాల్లోను పర్యటించాలనుకుంటున్నారని, తద్వారా సమస్యల పరిష్కారం కోసం చూస్తున్నారన్నారు.
చంద్రబాబు కూడా తెలంగాణలో కాకుండా తమ రాష్ట్రంలో పర్యటించి సమస్యల పరిష్కారం కోసం చూడాలన్నారు. కాగా, తెలంగాణలో టీడీపీలో కొత్త ఉత్సాహం తీసుకు వచ్చేందుకు చంద్రబాబు, నారా లోకేష్లు త్వరలో పర్యటించనున్నారు. ఇలాంటి సమయంలో మాజీ టీడీపీ నేత, ప్రస్తుత తెరాస నేత, మంత్రి అయిన మహేందర్ రెడ్డి.. చంద్రబాబుకు తెలంగాణలో పర్యటించే హక్కు లేదంటున్నారు.
అయితే, మహేందర్ రెడ్డి వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు కూడా ఘాటుగా సమాధానం చెప్పారు. స్వార్థం కోసం, పదవుల కోసం తెరాసలో చేరిన మహేందర్ రెడ్డి వంటి వారికి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పర్యటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె పాలమూరు జిల్లాలో పర్యటించి, తన తండ్రి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఇప్పుడు ఆమె నల్గొండలో పర్యటిస్తున్నారు.
షర్మిల నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం చందపేట మండలం పరిధిలోని దేవచర్ల తండాలో హనుమానాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మదనాపురంలో బాలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
షర్మిలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పలు సందర్భాల్లో షర్మిల మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల మనసుల్లో జీవించి ఉంటారన్నారు. పేదల ప్రజల కోసం వైయస్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు.