తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 75,783 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 35,665 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.08 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పట్టింది.
మొత్తం 19 కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. మున్ముందు భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల కోసం తిరుమల ముస్తాబయింది. మే 17వ తేదీన అంటే గురువారం నాడు ఈ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 19వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. దీనికోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల తొలిరోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజున గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు.
ప్రతి వైశాఖ శుద్ధ దశమికి ముందు తిరుమలలో ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. పురాణాల్లో ఉన్న నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలోనే శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాలను నిర్వహిస్తారు.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దయ్యాయి. మే 17 నుంచి 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 20వ తేదీన ఆ సేవలను పునరుద్ధరిస్తారు.












Click it and Unblock the Notifications