TTD నూతన ఛైర్మన్ తొలి నిర్ణయం - ఆ ట్రస్టు రద్దు, దర్శనంలో ఇలా..!!
తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రభుత్వం కొత్త పాలక వర్గం నియమించింది. ఛైర్మన్ గా మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడుతో సహా 24 మంది సభ్యులను ఖరారు చేసింది. ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న బీఆర్ నాయుడు తన తొలి ప్రాధాన్యత.. నిర్ణయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న విధానంలో కొన్ని మార్పులు అవసరమని చెప్పారు. అందులో భాగంగా కొన్ని రద్దు చేయటంతో పాటుగా దర్శనం టికెట్ల విషయంలోనూ నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు.
ప్రక్షాళన చేస్తాం
టీటీడీ ఛైర్మన్గా నియమితులైన బీఆర్ నాయుడు కీలక అంశాలను వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక టీటీడీ ఛైర్మన్గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని ఆరోపించారు. ఆ కారణంగా తాను గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తిరుమలకు సంబంధించి సీఎం చంద్రబాబుతో అన్ని విషయాలు మాట్లాడానన్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత వస్తే మాట్లాడదామని ఆయన చెప్పారన్నారని వివరించారు.

అదే నా కోరిక
సీఎం చంద్రబాబు సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తామని నాయుడు చెప్పారు. తాను 1982 నుంచి టీడీపీలో పనిచేస్తున్నానని వెల్లడించారు. పార్టీలో తనకు చాలా అనుభవం ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని .. తనకు స్వామీజీలతో కూడా పరిచయాలు ఉన్నాయని చెప్పారు. నీతి, నిజాయతీగా పనిచేయాలనేదే తన కోరిక అని వెల్లడించారు. తాను తన సొంత డబ్బుతో తిరుమలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలో పనిచేసేవాళ్లు ప్రతిఒక్కరూ హిందువై ఉండాలనేదే తన ప్రయత్నమని స్పష్టంచేశారు. ప్రతి విషయాన్ని బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శ్రీవారికి సేవ చేయాలనే ఆలోచనలతోనే వచ్చానని.. ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసారు.
శ్రీవాణి ట్రస్టు రద్దు
శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనేది తన ఆలోచన అని నూతన ఛైర్మన్ నాయుడు స్పష్టంచేశారు. ఒక పెద్ద ట్రస్టు ఉన్నప్పుడు మరో ట్రస్టు ఎందుకని ప్రశ్నించారు. దర్శనం కోసం భక్తులను ఎక్కువ సేపు కంపార్టుమెంట్లలో ఉంచటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. టికెట్ల విషయంలో ఆలోచన చేస్తామని.. గతంలో ఉన్న పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని వెల్లడించారు. మెటీరియల్ సప్లయ్, ఆలయ భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని ప్రకటించారు. తిరుమలలోని యూనివర్సిటీ, ఆస్పత్రుల పై దృష్టిసారిస్తామని నాయుడు స్పష్టం చేశారు. కొండపై గాజు సీసాల్లో నీళ్లు భక్తులకు భారంగా మారాయని పేర్కొన్నారు. కొండ పైన వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని నాయుడు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications