ఆ సంస్థలు శ్రీవారి భక్తులను మోసగిస్తోన్నాయ్..: టీటీడీ ఛైర్మన్
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 67,121 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 22,426 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దాతలకు కీలక సూచన చేశారు. శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోన్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, savetemples.org సంస్థలు శ్రీవారి భక్తుల నుంచి విరాళాలను స్వీకరిస్తోన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు.
ఈ రెండు సంస్థలకు చెందిన కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించడానికి ఈ నెల 29న ఒక కార్యక్రమం నిర్వహించనున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తోన్నారని, మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించడానికి భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి అనుమానాస్పద సంస్థలు, వ్యక్తులకు విరాళాలు ఇవ్వకుడదని, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తిరుచానూర్ లో లక్ష్మీకాసుల హారం ఊరేగింపు..
కాగా- పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర శుక్రవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం- పసుపుమండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడారు. శ్రీవారి ఆభరణాల్లో లక్ష్మీ కాసులహారం అత్యంత ప్రధానమైందని, పౌర్ణమి గరుడసేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్పస్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడవాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. సోమవారం రాత్రి జరుగనున్న గజ వాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.












Click it and Unblock the Notifications