తిరుమలలో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీల్లో..
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో ఈ కలియుగ వైకుంఠం క్రిక్కిరిసిపోతోంది. గురువారం నాడు 56,279 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,019 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.59 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏకంగా 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ పరిస్థితుల మధ్య టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఅర్ నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వద్ద కలియతిరిగారు. భక్తులకు అందుతున్న సదుపాయాలు, వసతులు, శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలు, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో చేపట్టాల్సిన ఇతర సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ క్రమంలో ఆయన పలువురు భక్తులను నేరుగా కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులతో బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీవారి దర్శనం ముగిసేంత వరకు వారికి అందిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు కల్పించాల్సిన ఇతర వసతులను మరింత మెరుగుపర్చడంపై వారి నుండి ఫీడ్ బ్యాక్ను తీసుకున్నారు. టీటీడీ సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు కొందరు భక్తులు ఈ సందర్భంగా చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయంటూ మరికొందరు భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

వయోధిక వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్ లైన్ ద్వార దర్శనానికి అనుమతించాలంటూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నందుకు కొందరు భక్తులు చైర్మన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా శీఘ్రగతిన శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారని అన్నారు.
అనంతరం బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయంలో దర్శన క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కొందరు సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా ఆయన- భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రెండో రోజు కూడా ఆకస్మిక తనిఖీలను కొనసాగించారు టీటీడీ ఛైర్మన్. శుక్రవారం సాయంత్రం శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట, నందకం మినీ కళ్యాణ కట్టలను సందర్శించారు. భక్తుల తలనీలాల సమర్పణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్షురకుల ప్రవర్తనపై అభిప్రాయాలను భక్తుల నుండి తెలుసుకున్నారు.
ఒక ప్రాంతంలోని కళ్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ తక్కువగా ఉండే కళ్యాణకట్టకు భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సేవాభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.












Click it and Unblock the Notifications