తిరుమలలో టీటీడీ ఛైర్మన్ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 68,760 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,544 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.90 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ పరిస్థితుల మధ్య టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఅర్ నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వద్ద కలియతిరిగారు. భక్తులకు అందుతున్న సదుపాయాలు, వసతులు, శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలు, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో చేపట్టాల్సిన ఇతర సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా ఆయన శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు భవనాన్ని తనిఖీ చేశారు. అన్న ప్రసాదాల తయారీ, వంట సామాగ్రి నిల్వ, శుభ్రతను పరిశీలించారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు. వారికి వడ్డిస్తున్న అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అన్నప్రసాదం నాణ్యత మెరుగుపడటం పట్ల భక్తులు అపారమైన సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసి క్యూ లైన్లను మరియు లడ్డూల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. లడ్డూల నాణ్యత, పరిమాణం, రుచిపై భక్తుల నుండి అభిప్రాయాలను కనుక్కొన్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యత మెరుగుపడటం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పలువురు భక్తులను నేరుగా కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులతో బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీవారి దర్శనం ముగిసేంత వరకు వారికి అందిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు కల్పించాల్సిన ఇతర వసతులను మరింత మెరుగుపర్చడంపై వారి నుండి ఫీడ్ బ్యాక్ను తీసుకున్నారు. వయోధిక వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్ లైన్ ద్వార దర్శనానికి అనుమతించాలంటూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నందుకు కొందరు భక్తులు చైర్మన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయంలో దర్శన క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.












Click it and Unblock the Notifications