టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ పాలక మండలి సమావేశం శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించారు. టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలని ఈ సమావేశంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

మే 5 నుండి శ్రీవారి మెట్ల మార్గం
శ్రీవారి మెట్ల మార్గాన్ని మే 5 నుండి ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురి కాకుండా కమిటీ సూచనలు చేసిందని వెల్లడించారు. అనేక ప్రాంతాలలో ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రెండు విడతలుగా మరమ్మతు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఘాట్ రోడ్డు మరమ్మత్తులకు 36 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

నడకదారి భక్తులకు దివ్య దర్శన టిక్కెట్లను కేటాయిస్తున్నాం
ఇక నడకదారి భక్తులకు దివ్య దర్శన టిక్కెట్లను కేటాయించాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు వై.వి.సుబ్బారెడ్డి. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా అందించారని వై వి సుబ్బారెడ్డి వెల్లడించారు. దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతామని వెల్లడించారు. ఇక ఆలయ నిర్మాణానికి పూర్తి ఆర్థిక మద్దతు ఇవ్వడానికి గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారంటూ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.

టిటిడి ఉద్యోగుల ఇంటి స్థలాలపై నిర్ణయం
టిటిడి ఉద్యోగుల ఇంటి స్థలాలపై నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. తిరుమలలోని టిటిడి ఉద్యోగులు ఉండే 737 కాటేజీలు మరమ్మత్తుల పనులు చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. శ్రీనివాససేతు ప్రారంభం చేయనున్నామని పేర్కొన్న వై వి సుబ్బారెడ్డి తిరుమల బాలాజీ నగర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. బయోగ్యాస్ ను అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ తయారీకి ఉపయోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

సీఎం తిరుపతి పర్యటనపై వైవీ సుబ్బారెడ్డి
ఇక ధన రూపంలో ఇచ్చే విరాళాలకు టీటీడీ ఇస్తున్న ప్రివిలేజ్, ఇకపై వస్తు రూపంలో ఇచ్చే విరాళాలకు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు గా తెలిపారు. సీఎం తిరుపతి పర్యటనలో చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. టాటా క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. బర్డ్స్ ఆస్పత్రిలో స్మైల్వ ట్రైన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో తిరుమల స్థానిక సమస్యల పరిష్కారానికి పాలకమండలి నిర్ణయం తీసుకుందని వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications