తిరుపతిలో కన్నుల పండువగా..
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 88,938 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,548 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.39 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్స్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

మరోవంక- తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు సోమవారం ఆరంభం అయ్యాయి. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుండి శాస్రోక్తంగా స్వామివారికి కైంకర్యాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకారం, అర్చన, నివేదన చేపట్టారు. 9 నుంచి 10 గంటల వరకు పంచమూర్తుల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, అలంకారం నిర్వహించారు. సాయంత్రం కలశ స్థాపనం, కలశ పూజ, అగ్నికార్యం, హోమం, లఘు పూర్ణాహూతి, గ్రంధి పవిత్ర ప్రతిష్ట వంటి కార్యక్రమాలను వైభవోపేతంగా పూర్తిచేశారు అర్చకులు.
రెండో రోజు- ఈ ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. ఈ సాయంత్రం యాగశాలపూజ, హోమ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మూడో రోజైన 9వ తేదీన ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పవిత్రోత్సవాలను తిలకించడానికి భక్తులు కపిలతీర్థం ఆలయానికి పోటెత్తుతున్నారు. దీనికి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications