టీటీడీ సరికొత్త రికార్డ్..!!
Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల పెద్ద ఎత్తున రైలు సర్వీసులు రద్దు కావడం, అనేక చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోవడం, జనజీవనం స్తంభించిపోవడం.. వంటి కారణాలు భక్తుల రోజువారీ సంఖ్యపై ప్రభావాన్ని చూపాయి.
ఈ నెల 3, 4 తేదీల్లో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య 60 వేల లోపే ఉండటం దీనికి నిదర్శనం. 3వ తేదీన 57,817, 4వ తేదీన 57,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 5వ తేదీ నాడు ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది. 61,142 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 6వ తేదీ నాటికి మళ్లీ తగ్గింది.

శుక్రవారం నాడు 58,100 మంది ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. వారిలో 20,817 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.39 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది.
కాగా- ఆగస్టులో 22.42 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 125.67 కోట్ల రూపాయల మేర ఆదాయం అందింది. హుండీ ద్వారా అందే రెవెన్యూ మరోసారి 100 కోట్ల రూపాయలను దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అదే సమయంలో- 1.06 కోట్ల శ్రీవారి లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే- 24.33 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 9.49 లక్షల మంది భక్తులు తమ తలనీలాలను శ్రీవారికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
రెండు సంవత్సరాల కాలంలో క్రమం తప్పకుండా టీటీడీకి అందే హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలను అధిగమిస్తూ వస్తోంది. కిందటి ఏడాది ఏప్రిల్లో గరిష్ఠంగా 140 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.












Click it and Unblock the Notifications