శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వాహనాల పార్కింగ్ ఇలా..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. శుక్రవారం నాడు 73,104 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,330 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.25 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. రోజూ లక్షమంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలపై కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు- అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
తిరుమలలో తగినంత పార్కింగ్ సౌకర్యం అందుబాటులో లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో కొండపైకి వచ్చే వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి- గరుడ సేవ నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య, వాహనాల తాకిడీ రెట్టింపు అవుతుంటుంది.

ఫలితంగా తిరుమలలో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి టీటీడీ అధికారులు దృష్టి సారించారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలను కాకుండా ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని ఈవో శ్యామలరావు విజ్ఞప్తి చేశారు.
గత రెండు సంవత్సరాలుగా తిరుమలకు వచ్చే భక్తుల, వాహనాల సంఖ్య భారీగా పెరగిందని, ఫలితంగా పార్కింగ్ స్థలాల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, గరుడ సేవ రోజున భక్తులను తిరుమలకు తరలించడానికి తగినన్ని బస్సులను నడిపించాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులకు సూచించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల వాహనాలకు అలిపిరి లింక్ బస్టాండ్, మున్సిపల్ గ్రౌండ్స్, వినాయక నగర్ క్వార్టర్స్లో ద్విచక్ర వాహనాలు, భారతీయ విద్యాభవన్ స్కూల్లో ప్రైవేట్ జీపులు, కార్లు, శ్రీవేంకటేశ్వర జులాజికల్ పార్క్ వద్ద గల దేవలోక్లో ప్రైవేట్ బస్సులకు పార్కింగ్ కల్పించారు.
అదేవిధంగా చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం కామన్ కమాండ్ సెంటర్ పాయింట్లో కొనసాగుతున్న లగేజీ సెంటర్ను అక్కడి నుంచి తాత్కాలికంగా తరలించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు సేవా సదన్ 1, సేవా సదన్ 2 ఎదురుగా మార్చనున్నారు.












Click it and Unblock the Notifications