TTD: తిరుమలలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం, గరుడసేవ - భక్తులకు దర్శనం..!!
Tirumala: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 26వ తేదీన ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగనుంది. ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి అలయంలో కార్తీకమాసంలో కార్తీకదీపోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.నవంబరు 27న పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
కార్తీక పౌర్ణమి వేళ: ప్రతీ ఏటా కార్తీక మాసం తిరుమల ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. ఈ సారి కార్తీక పౌర్ణమి వేళ 26వ తేదీన ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు.

ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళామాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేర, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, శ్రీయోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి వద్ద దీపాలు వెలిగిస్తారు.
దీపోత్సవం..గరుడ సేవ: ఈ విశిష్ఠత కలిగిన ప్రదేశాలతో పాటుగా ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, శ్రీ బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలు వెలిగించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది.

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27న సోమవారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
బ్రేక్ దర్శనాల రద్దు: ఇదే సమయంలో టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27వ తేదీన(సోమవారం) పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కావున నవంబరు 26వ తేదీన(ఆదివారం) సిఫారసు లేఖలు స్వీకరించటం లేదని స్పష్టం చేసింది. తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి శుక్రవారం ఘనంగా జరిగింది.

ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా చెబుతారు.












Click it and Unblock the Notifications