టీటీడీ స్కూళ్లల్లో ఈ నెల 27వ తేదీ వరకు.. !!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం 81,553 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వారిలో 34,483 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.17 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. 3.95 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.06 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
కాగా- ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విరాజిల్లుతున్న టీటీడీ ఈ సంవత్సరం కూడా సద్గమయ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. విద్యార్థులకు హిందూ సనాతన ధర్మం గురించి బోధించడం, వారిలో నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించిన విషయం తెలిసిదే. దీని పేరు సద్గమయ. సోమవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతుంది.

తిరుపతి, తిరుమలలోని ఏడు పాఠశాలల్లో డే స్కాలర్లకు రోజుకు ఒక గంట చొప్పున నాలుగు రోజుల పాటు సద్గమయ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు. టీటీడీకి చెందిన ఏడు పాఠశాలలు- తిరుపతిలోని ఎస్జీఎస్ హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, ఎస్వీ హైస్కూల్, ఎస్ కే ఆర్ ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్పీ బాలికల పాఠశాల, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తాటితోపులోని ఎస్ కె ఎస్ హైస్కూల్ పిల్లలకు ఆయా పాఠశాలల్లో సదరు తేదీలలో శిక్షణ ఇస్తోన్నారు.
ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 1,678 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా, సరళమైన పదాలతో బోధిస్తారు. విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత.. తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది టీటీడీ. దీనికి అవసరమైన 'సద్గమయ' మాడ్యూల్, లిటరేచర్ పుస్తకాలు అందించింది.
సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్.. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. విద్యతో పాటు విలువలు, సంస్కారం, ఆధ్యాత్మిక చైతన్యం అందించినప్పుడే ఉత్తమ వ్యక్తిత్వం, బాధ్యతాయుత పౌరసమాజం నిర్మాణమవుతుందని అన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీతతో పాటు మహనీయుల జీవితాలు, వారి బోధనల ద్వారా విద్యార్థులకు విలువాధారిత విద్యను అందించనున్నట్లు తెలిపారు.
సద్గమయ ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, భక్తి, సత్యనిష్ఠ, సత్ప్రవర్తన, దేశభక్తి, భారతీయ సంస్కృతిపై గౌరవం వంటి సద్గుణాలను విద్యార్థుల్లో పెంపొందిస్తామని, దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వ్యక్తీకరణ సామర్థ్యంతో పాటు నైతిక వ్యక్తిత్వం కూడా వికసిస్తుందని ఆయన వివరించారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నచికేతుడు వంటి బాల భక్తుల అచంచల భక్తి, ధైర్యం, ఏకాగ్రత, పట్టుదలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, భక్తి, జ్ఞానం, సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.















Click it and Unblock the Notifications