తిరుపతిలో విగ్రహాల వివాదం- చిక్కుల్లో పడ్డ భూమన
తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సరికొత్త రాజకీయ వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి. టీటీడీపై భూమన ఉద్దేశపూరకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. అలిపిరి పాదాల చెంత ఉన్నది శ్రీమహావిష్ణువు విగ్రహం కాదు.. శనీశ్వరుడి విగ్రహమని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో టీటీడీని అప్రతిష్టపాలు చేసేలా, అవాస్తవాలను ప్రచారం చేస్తోన్నాడనే కారణంతో టీటీడీ చర్యలకు దిగింది. భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భూమనపై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. భూమనపై టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్ గోవిందరాజులు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.

అలిపిరి లింక్ బస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై ఉన్న ఆ విగ్రహం శ్రీ వేంకటేశ్వర స్వామిది కాదని, అది పట్నా కన్నాచారి అనే శిల్పి 20 సంవత్సరాల క్రితం చెక్కిన అసంపూర్తి శనీశ్వర స్వామి విగ్రహమని స్పష్టం చేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేయమని పురమాయించిన వ్యక్తి తర్వాత పట్టించుకోకపోవడంతో, శిల్పి ఈ అసంపూర్తి విగ్రహాన్ని అలిపిరి లింక్ బస్ స్టాండ్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఉంచారని, దీనికి టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
టీటీడీని అప్రతిష్టపాలు చేయడానికే భూమన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి, టీటీడీ ప్రతిష్టను అగౌరవపరచడానికి, ప్రజలలో అశాంతిని రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ విమర్శలు చేస్తోన్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఫిర్యాదులో వ్యాఖ్యానించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భూమన కరుణాకర్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
అంతకుముంద- ఈ విమర్శలను భూమన తిప్పికొట్టారు. శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని గుర్తు చేశారు. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగిందని చెబితే.. తనపై కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. అలిపిరి పాదాల చెంత పడివున్న విగ్రహం శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అంటున్నారని, శిల్పి చెక్కి పడేశాడని నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు.
శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వరుడి విగ్రహం ఎలా అవుతుందని భూమన ప్రశ్నించారు. శనీశ్వరుడు విల్లు, బాణం ధరిస్తాడని స్పష్టం చేశారు. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే అని తేల్చిచెప్పారు. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఖాసన ఆగ్రమ శాస్త్రం తెలియని వాళ్లు తనపై అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications