ఏప్రిల్లో తిరుమలలో విశేష ఉత్సవాలు: ఉగాది నాడు కన్నుల పండువగా
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. మంగళవారం నాడు 68,563 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 21,956 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.91 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
కాగా 10 కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు దర్శనానికి 8నుంచి 10 గంటల సమయం పట్టింది. వేసవి సెలవుల్లో రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

ఏప్రిల్లో తిరుమలలో నిర్వహించబోయే విశేష ఉత్సవాలు, పర్వదినాలకు సంబంధించిన పూర్తి జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు, శ్రీవారి ఆలయంలో నిర్వహించబోయే ఆస్థానం, శ్రీరామనవమి.. వంటి విశేష పర్వదినాలు ఉన్నాయి.
ఏప్రిల్ 5వ తేదీన శ్రీ అన్నమాచార్య వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 7వ తేదీన మాసశివరాత్రి, 8వ తేదీన సర్వ అమావాస్య సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపడతారు. ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగను అత్యంత వైభవంగా జరుపుతారు.
అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. దీనికోసం శ్రీవారి ఆలయాన్ని అందంగా అలంకరించనున్నారు టీటీడీ అధికారులు. ఏప్రిల్ 11వ తేదీన మత్స్యజయంతిని వేడుకలను చేపడతారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన మత్స్య జయంతి వేడుకలను ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండువగా జరుపుతారు. అదే రోజున రామనవమి ఆస్థానాన్ని, ఆ మరుసటి రోజు అంటే 18వ తేదీన శ్రీరామపట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీన సర్వ ఏకాదశి ఉంటుంది. ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు వసంతోత్సవాలను వైభవంగా పూర్తి చేస్తారు.












Click it and Unblock the Notifications