రూ.300ల దర్శనం, వసతి గదుల కోటా విడుదల తేదీలు ఇవే
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. రెండు కంపార్ట్మెంట్లల్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు. బుధవారం నాడు 62,499 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 18,555 మంది తలనీలాలను సమర్పించారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి 10 గంటల సమయం పట్టింది. హుండీ ద్వారా 3.45 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా ఈ నెల 24వ తేదీన విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఈ టికెట్లు విడుదల అవుతాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటా టికెట్లు కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి.

తిరుమల, తిరుపతిల్లో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18వ తేదీన ఓపెన్ అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఇది అందుబాటులో ఉంటుంది. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధాన సేవల లక్కీడిప్ కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
లక్కీ డిప్ ఫలితాలు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. డిప్లో ఎంపిక అయిన వాళ్లు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించి తమ పేరును ఖరారు చేయించుకోవాల్సి ఉంటుంది.
అంగప్రదక్షిణం టోకెన్లు 23వ తేదీన ఉదయం 10 గంటలకు, సీనియర్ సిటిజన్లు/దివ్యాంగుల కోటా బుకింగ్ అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం కేటాయించిన దర్శనం, వసతి గదుల కోటా 23వ తేదీ నాడు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో వస్తాయి.












Click it and Unblock the Notifications