శ్రీవారి మెట్లోత్సవంలో ఎన్నో విశేషాలు- మహద్భాగ్యం: ముహూర్తం ఫిక్స్
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం నాడు 73,599 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 16,069 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీ అయ్యాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచివుండనక్కర్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- తిరుమలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీ మెట్లోత్సవం ఆరంభమౌతుంది. 13వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుమలలోని ఆస్థాన మండపం దీనికి వేదిక.
11, 12వ తేదీల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో స్వామివారి నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలతో తిరుమలలో ఆధ్యత్మిక శోభ సంతరించుకోనుంది. మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలను వినిపిస్తారు.
12వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ మెట్ల మార్గం గుండా కాలినడకన సప్తగిరీశుడి సన్నిధికి చేరుకుంటారు. అదే రోజు
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
ఫిబ్రవరి 13న ఉదయం 8.30 గంటలకు సామూహిక నామ సంకీర్తన, ఉదయం 9.30 గంటల నుండి స్వామిజీలు ధార్మిక సందేశం ఇవ్వనున్నారు. ఎందరో మహర్షులు, రాజర్షులు పురందరదాసు, వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు.
అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టాలు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయనేది అశేష భక్తుల విశ్వాసం.












Click it and Unblock the Notifications