శ్రీవారి భక్తులకు సర్వదర్శనం పై TTD గుడ్ న్యూస్, నిరీక్షణకు చెక్ - ఇక నుంచి..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. నూతన సంవత్సరం ప్రారంభం రోజున శ్రీవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.ఈ డిప్ ద్వారా టోకెన్స్ పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం కేటాయించారు. అదే సమయంలో మూడవ రోజు వైకుంఠ ద్వారం నుంచి దర్శనాలు కొన సాగుతున్నాయి. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,256 గా టీటీడీ వెల్లడించింది. ఇక.. రేపటి నుంచి సర్వదర్శనంలో అమలు చేయాల్సిన విధానం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
వైకుంఠ ఏకాదశి వేళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. టీటీడీ భక్తుల రద్దీ నిర్వహణ కోసం క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా నిరీక్షణ అవసరం లేకుండానే దర్శనం దక్కుతోంది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. సుమారు 70 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగ్గట్టుగా స్లాట్ విధానాన్ని అమలు చేసింది. ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఏ సమయానికి చేరుకోవాలి? అనే సమాచారాన్ని భక్తులకు ముందే మెసేజ్లు పంపించింది. దీంతో వైకుంఠ ఏకాదశి (డిసెంబరు 30) రోజు రికార్డు స్థాయిలో 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. చాలా మంది భక్తులకు గంటన్నార నుంచి రెండు గంటల్లోనే దర్శనం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఒకేచోట రద్దీ ఏర్పడకుండా మూడు వేర్వేరు ప్రాంతాల్లో (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) రిపోర్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి క్యూ లైన్లను నిర్వహించారు.టికెట్ జారీ దగ్గరి నుంచి లగేజ్ డిపాజిట్, బాడీ స్కానింగ్, దర్శనం పూర్తయ్యే వరకూ ప్రతిదశనూ రియల్ టైమ్లో (ఐసీసీసీ) డాష్బోర్డు ద్వారా పర్యవేక్షించారు. దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలు, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 42 ఎఫ్.ఆర్.ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్) కెమెరాల ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. క్యూలైన్లలో ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే ఆన్లైన్ ద్వారా గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాగా, రేపు జనవరి 2 నుంచి సామాన్య భక్తుల కోసం సర్వదర్శనం (ఉచిత దర్శనం) ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అనుసరించిన క్యూలైన్ మేనేజ్మెంట్ విధానాన్నే అందులోనూ కొనసాగించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications