TTD: వైకుంఠ ద్వార దర్శనం పై ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు..!!
Tirumala: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే భక్తులకు దర్శనానికి సంబంధించి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేసారు. వైకుంఠ ద్వార దర్శనం వేళ ఇతర సేవలు..దర్శనాల విషయంలోనూ టీటీడీ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యాల్లో మార్పులు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం : వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటి వరకు 2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను నవంబరు 10న ఆన్లైన్లో విడుదల చేసినట్లు వెల్లడించారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్ కౌంటర్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు..

టోకెన్లు ఉంటేనే దర్శనం : దర్శనటోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. డిసెంబరు 22 నుండి 24వ తేదీ వరకు, డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేయడమైనది. ఈ సేవలను డిసెంబరు 25 నుండి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు సహస్రదీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై : వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామని వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 12వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కావడంతో ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పాశురాల పారాయణం నిర్వహించి భక్తులందరూ పఠించేలా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఈవో వివరించారు.












Click it and Unblock the Notifications