TTD: శ్రీవారి సేవలో పాల్గొనాలనుకొనే భక్తులకు శుభవార్త..!!
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. నవంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను రేపు (సోమవారం) నుంచి విడుదల చేయనున్నారు. 24వ తేదీ వరకు వరుసగా సేవా టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక..శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు పెంచుతున్నట్లు ఈవో శ్యామలా రావు వెల్లడించారు. అటు బ్రహ్మోత్సవాలకు కార్యాచరణ ఖరారు చేసారు.
నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 19న విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 22వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతి శ్రీవారి స్వచ్ఛంద సేవా జనరల్ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఎన్నీ గదులు అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఈవో శ్యామల రావు ఆదేశించారు.












Click it and Unblock the Notifications