చెన్నై నుంచి తిరుమల చేరిన గొడుగులు: భక్తులకు తులసీ ప్రసాదం పంపిణీ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. గురువారం నాడు 68,265 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 26,959 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.16 కోట్ల రూపాయల మేర కానుకలు టీటీడీకి అందాయి. 3.21 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. 1.72 లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు.. నాలుగో రోజు. ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. స్వామివారికి హారతులు పట్టారు. గోవిందుడి నామ స్మరణతో తిరుమల పులకించిపోయింది.

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దివ్య సంపదల్లో కల్పవృక్షం ఒకటి. కోరిన ఫలాలను ప్రసాదించే కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన శ్రీనివాసుడు భక్తులకు సర్వాభీష్టాలను ప్రసాదించే దివ్యరూపంలో దర్శనమిచ్చారు. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి మొత్తం తొమ్మిది గొడుగులను విరాళంగా అందించింది. ఇవి ఈ ఉదయం తిరుమలకు చేరాయి. వీటిని సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్ జీ.. టీటీడీకి అందజేశారు. ముద్దాడ రవిచంద్ర, వెంకయ్య చౌదరి వీటిని స్వీకరించారు. వరుసగా 22 సంవత్సరాలుగా చెన్నై హిందూ ధర్మార్థ సమితి.. శ్రీవారికి గొడుగులను సమర్పిస్తూ వస్తోంది.
మరోవంక.. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికీ పవిత్ర తులసి మొక్కలను శ్రీవారి ప్రసాదంగా అందజేస్తోంది టీటీడీ ఉద్యాన విభాగం. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచీ తిరుమలకు వచ్చిన భక్తులకు తులసి మొక్కలను పంపిణీ చేస్తోంది. తులసీ ప్రసాదంగా వీటిని స్వీకరిస్తోన్నారు భక్తులు. హిందూధర్మంలో తులసీ మొక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపంగా తులసిని పూజిస్తారు.













Click it and Unblock the Notifications
