ఆదివారం కూడా..: ఎన్ కన్వెన్షన్ వ్యవహారంలో ట్విస్ట్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ వ్యవహారం కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. తుమ్మిడికుంట చెరువులోని నిర్మాణాలను ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం నిర్మాణాలను కొన్నింటిని కూల్చివేస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు ఇవ్వకముందే యాజమాన్యం స్వచ్చంధంగా కూల్చివేతలు చేపట్టడం చర్చనీయాంశమైంది.
గురుకుల్ ట్రస్టులో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కొద్ది రోజుల క్రితం కూల్చి వేశారు. ఇందులో భాగంగా తమ్మిడికుంట చెరువు శిఖం స్థలంలో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సర్వేలో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 3 ఎకరాల 12 గుంటల స్థలాన్ని శిఖం భూమితో పాటు బఫర్ జోన్గా అధికారులు గుర్తించారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన నాగార్జున కోర్టుకు వెళ్లారు. నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాలని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. దీంతో, ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ముందుగానే దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. శనివారం సాయంత్రం, ఆదివారం ఎన్ కన్వెన్షన్లోని కొన్ని నిర్మాణాలను యాజమాన్యం స్వచ్చందంగా తొలగించింది.