గెంటిస్తాం: గంటా, టిడిపి గూండాల దాడి: బొత్స, రిషికేశ్వరి మృతి కేసులో మలుపు
గుంటూరు/చిత్తూరు: ఏళ్ల తరబడి విశ్వవిద్యాలయాల్లో తిష్ట వేసిన వారిని పోలీసులతో గెంటేయిస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ రావు సోమవారం నాడు చెప్పారు. ర్యాగింగ్ను ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు. రిషికేశ్వరి వంటి సంఘటన మరొకటి జరగకుండా చూస్తామన్నారు.
విశ్వవిద్యాలయాల్లో కుల సంఘాలు ఉండవద్దని గంటా చెప్పారు. వచ్చే కేబినెట్లో ప్రయివేటు విశ్వవిద్యాలయ బిల్లు పెడతామని చెప్పారు.
రిషికేశ్వరి మృతిపై విచారణ కమిటీ
రిషికేశ్వరి మృతి పైన నలుగురితో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఏఐఎస్ బాలసుబ్రహ్మణ్యం, సింహపురి, ఎస్వీ వర్సిటీల వీసీలు, పద్మావతి మహిళా వర్సిటీ రిజిస్ట్రార్లు ఉన్నారు.
నిందితులను కాపాడేయత్నం: విజయ సాయి రెడ్డి
రిషికేశ్వరి మృతి కేసులో నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి సోమవారం నాడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవస్థ పైన దాడి చేస్తున్నార్నారు.
వ్యక్తి కాదు.. వ్యవస్థపై దాడి: బొత్స
అమరావతి రాజధాని నిర్మాణానికి రైతుల భూములు లాక్కొని వారిని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రెవెన్యూ, ప్రజా వ్యవస్థ పైన టిడిపి గూండాలు రౌడీయిజం చేస్తున్నారన్నారు. టిడిపి హయాంలో వ్యక్తుల పైన కాదని, వ్యవస్థ పైన దాడి జరుగుతోందన్నారు.
రిషికేశ్వరి కేసులో మరో మలుపు
రిషికేశ్వరి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రిషికేశ్వరి ఆత్మహత్యలో వర్శిటీ ప్రిన్సిపల్ ప్రమేయం కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే తన సూసైడ్ నోట్లో రిషికేశ్వర్ అనీషా, సీనియర్ స్టూడెంట్స్ జయచంద్రన్ మరియు శ్రీనివాస్ అనేవారు తనను వేధించారని పేర్కొంది.
అలాగే ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రిన్సిపల్ పేరు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అందరి నోళ్ళల్లో నానుతోంది. కాలేజీ క్యాంపస్లో ప్రిన్సిపల్ ర్యాంగింగ్ను ప్రోత్సహించే వారని ఆరోపిస్తున్నారు. ఫ్రెషర్స్ డే రోజున ప్రిన్సిపల్ బాలీవుడ్ పాటలకు సీనియర్ స్టూడెంట్స్తో కలిసి డ్యాన్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ అభియోగాలు రావడంతో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రిన్సిపల్ బాబురావు వెంటనే ఆ పదవికి జీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. కాగా, తన కుమార్తె రిషికేశ్వరి గదిని మార్పు చేయాల్సిందిగా ఆయన్ని కోరితే అందుకు ఆయన అనుమతించలేదని తండ్రి ఆరోపిస్తున్నారు.
కాలేజీలో యాంటీ-ర్యాంగింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఫ్రెషర్స్ డే రోజున ప్రిన్సిపల్ డ్యాన్స్ చేయడాన్ని ఆ కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు కళ్లారా చూశారని కూడా చెబుతున్నారు.