దాడులతో ఉలిక్కిపడుతున్న హైద్రాబాద్: ఇద్దరిపై పెట్రోల్ పోసి కాల్చారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు వరుస దాడులతో ఉలిక్కిపడుతోంది. బుధవారం నాడు జ్యోతిష్కుడు నాగరాజు పైన కాల్పులు జరిగిన సంఘటన, అనంతరం సూర్యాపేట వద్ద పోలీసులపై కాల్పుల ఘటనలు మరవకముందే సికింద్రాబాదులో మరో ఘోరం జరిగింది.
మహంకాళీ పోలీసు స్టేషన్ పరిధిలో కొబ్బరికాయలు అమ్ముకునే ఆనంద్ అనే వ్యక్తి పైన పెట్రోలు పోసి కొందరు దుండగులు నిప్పు అంటించారు. అలాగే, నర్సింహా రావు అనే మరో వ్యక్తి పైన కూడా పెట్రోలు పోసి నిప్పు అంటించారు. ఆనంద్ పడుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
ఆనంద్, నర్సింహారావులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆనంద్కు నలభై శాతం, నర్సింహా రావుకు 30 శాతం మేర గాయాలయ్యాయి. ఈ సంఘటనలకు సంబంధించి రెండు పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.
ఆనంద్ పైన పెట్రోలు పోసిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం పైన పారిపోయారు. ఇది సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమై ఉంది. టీవీలర్ పైన ఉన్న నెంబర్ ఆధారంగా సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది కావాలనే కొందరు చేస్తున్నారా? మరో రెండు రోజుల్లో హనుమాన్ జయంతి ఉన్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.