ఏపీలో కొత్తగా రెండు కరోనా కేసులు -మొత్తం 365కు చేరిక... వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు పరీక్షలు కూడా తుది దశకు చేరుకోవడంతో కేసుల నమోదు తీవ్రత కాస్త తగ్గింది. గత 12 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.. దీంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటోంది.
12 గంటలు 2 కేసులు...
ఏపీలో గత నాలుగు రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన తాజా హెల్త్ బులిటెన్లోనూ దీని ప్రభావం కనిపించింది. గత 12 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కేవలం రెండే కేసులు నమోదు కావడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. గత 24 గంటల్లో దాదాపు 900 మంది శాంపిల్స్ ఫలితాలు వచ్చాయి. వీటిలో రాత్రి నమోదైన 15 కేసులు తీసేస్తే గత 12 గంటల్లో అనంతపురం జిల్లాలోనే ఈ రెండు కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంటోంది.

ఆరు మరణాలు, 10 మంది డిశ్చార్జ్...
రాష్ట్రంలో గత 12 గంటల్లో ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదని ప్రభుత్వం తాజా హెల్త్ బులిటెన్లో పేర్కొంది. అలాగే ఇప్పటివరకూ ఆరుగురు రోగులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అటు చికిత్స తర్వాత రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 10కి చేరింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో నలుగురు కోలుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కరోనా బాధితులను గుర్తించేందుకు చేపట్టిన మూడో విడత సర్వే కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications