ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు
కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్ల జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పంట పండుతోంది. దీనికితోడు కేంద్రం తెలుగుదేశం పార్టీ ఎంపీలపై ఆధారపడటం కూడా ఒక ప్రధాన కారణమవుతోంది. రైల్వేకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ ఏపీలో పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. వీటిల్లో ప్రధానమైన నడికుడి - శ్రీకాళహస్తి, కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్లను సత్వరమే పూర్తిచేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. కోనసీమ మొత్తానికి కీలకమైన కోటిపల్లి - నరసాపురం రైల్వేలైను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటోంది. ఈ లైను పూర్తయితే మొత్తం కోనసీమ ప్రాంతాన్ని చుట్టేయొచ్చు.
18 గ్రామాలమీదుగా సాగుతుండటంతో..
ఈ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తయింది. 18 గ్రామాలమీదుగా సాగే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో చాలామంది ఇళ్లు కట్టేసుకున్నారు. దీంతో రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాల్సి వచ్చింది. కొత్త రైల్వే లైను 60 కిలోమీటర్లకు పెరిగింది. అయితే పాత మార్గమే కొనసాగించాలని కొందరు అన్నదాతలు కోరుతుండగా, కొత్త మార్గం కొనసాగించాలని మరికొందరు రైతులు కోరుతున్నారు. నడికుడి -శ్రీకాళహస్తి రైల్వే లైనుకు సంబంధించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిగా రైల్వే లైను నిర్మాణం జరుపుకుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం పనులు ప్రారంభం కాలేదు.

భూమిని అందజేస్తే వెంటనే పూర్తిచేస్తాం
సేకరించాల్సిన భూమి ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి తిరుపతికి, విజయవాడ నుంచి చెన్నైకి ప్రత్యామ్నాయ రైల్వేలైనుగా మారుతుంది. ప్రకృతి విపత్తుల సమయంలో ఈ రైల్వేలైను అక్కరకొస్తుంది. వెనకబడిన ప్రాంతాలైన దర్శి, కనిగిరి, పొదిలి లాంటి ప్రాంతాలకు రైల్వే లైను అందుబాటులోకి వస్తుంది. భూసేకరణ విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించగలిగితే సత్వరమే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందంటున్నారు.
గుంటూరు-సికింద్రాబాద్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనులు కూడా పూర్తయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి చెన్నైకి అతి తక్కువ సమయంలో చేరుకునే వీలుంటుంది. అవసరమైనచోట రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సత్వరమే భూమిని అందజేస్తే పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసి రైల్వే లైనును అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications