ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ నిద్ర మత్తు ఇద్దరి ప్రాణాలను బలిగొంది
అమరావతి: కారు డ్రైవర్ నిద్ర మత్తు, అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలిగొన్న సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు... చెన్నై ప్రాంతంలోని పొన్నేరిలో డాక్టర్లు మువ్వా భవాని (48), ఆదిశేషారావు సాయిభవాని 20 ఏళ్లుగా ఓ డయాబెటిక్ సెంటర్ను నిర్వహిస్తున్నారు.
ఆదిశేషారావు తండ్రి సంవత్సరికం సందర్భంగా స్వగ్రామైన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు 14వ తేదీన వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 16వ తేదీన భవాని స్వగ్రామం తెనాలికి వచ్చారు. అక్కడ చదువుకుంటున్న కుమారుడిని చూసి శనివారం రాత్రి 8 గంటకు పొన్నేరికి కారులో బయల్దేదారు.
ఈ క్రమంలో కలగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులో కారును అతివేగంగా నడపడంతో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టాడు. దీంతో కారు లారీ వెనుక భాగంలో సగం వరకు దూసుకుపోయింది. దీంతో కారు డ్రైవర్ ధరణి నరేష్ (30), డాక్టర్ భవాని అక్కడికక్కడే మృతి చెందారు.
ఇక ఆదిశేషారావుకు స్వల్పగాయాలు కాగా, వీరికి సహాయంగా వచ్చిన కుమార్ అనే యువకుడు తీవ్రగాయాలతో బయట పడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో కుమార్ జరిగిన ప్రమాదంలో కారులోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదం ఆదివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు జరిగింది. విషయం తెలుసుకుని ఎస్సై, పోలీస్లు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఎంత ప్రయత్నంచినా కారులో ఇరుక్కుపోయిన కుమార్ని బయటకు తీసుకురాలేకపోయారు.
దీంతో ఎస్సై మారుతీకృష్ణ చివరికి నాయుడుపేట నుంచి ఓ క్రేన్ తెప్పించి గాయపడిన కుమార్ను కారు నుంచి బయటకు తీసేసరికే రెండు గంటలు పట్టింది. అప్పటి వరకు కాపాడండి కాపాడండి అంటూ ఆ కుమార్ నరకయాతన పడ్డాడు. కుమార్ పిరిస్థితిని చూసిన స్థానికులు చలించిపోయారు. కాగా, డ్రైవర్ చెన్నై దగ్గరలోని అనపంబట్టు ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసుల తెలిపారు.