దొంగల భయంతో మేడపై నుంచి దూకిన యువకులు:పరిస్థితి విషమం
శ్రీకాకుళం:హాయిగా చల్లగాలికి ఆరుబయట మేడపై తమ స్నేహితులతో కలసి ముచ్చట్లు చెప్పుకుంటూ పడుకోవాలనే కోరిక చివరకు ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది.
లఘు శంక తీర్చుకునేందుకు కిందకు దిగిన స్నేహితుడు తిరిగి నిచ్చెన మీదుగా పైకెక్కుతుండగా అతడిని దొంగగా పొరబడిన స్థానికులు దొంగలు వస్తున్నారంటూ కేకలు వేశారు. దీంతో పైన నిద్రిస్తున్న యువకుల్లో ఇద్దరు భయంతో ఒక్కసారిగా మేడపై నుంచి దూకేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని ఆదిఆంధ్రవీధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
ప్రత్యక్ష సాక్షుల కతనం మేరకు...కిర్రి అరుణ్కుమార్, దేవాది శ్యామలరావు అనే ఇద్దరు యువకులు తమ స్నేహితులతో కలసి ఇంటికి సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఒక మెట్లు లేని మేడపై పడుకున్నారు. అయితే వీరు మేడపై పడుకున్న విషయాన్ని స్థానికులు గమనించలేదు. మరోవైపు భవనంపై పడుకున్న మిత్రులు పార్థీ గ్యాంగ్...పిల్లల్ని ఎత్తికెళ్లే గ్యాంగ్ గురించి వాట్సాప్ లో పోస్ట్ లపై వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే మేడపై పడుకున్న యువకుల్లో ఒకరు ప్రకృతి అవసరం తీర్చుకునేందుకని కిందకు దిగి తదనంతరం మళ్లీ పైకి వెళ్లేందుకు నిచ్చెన ఎక్కుతుండగా చీకట్లో ఈ యువకుడిని చూసిన గ్రామస్థులు దొంగలు...దొంగలు...మేడెక్కుతున్నారని కేకలు వేశారు. ఈ కేకలు విన్న యువకుల్లో కిర్రి అరుణ్కుమార్, దేవాది శ్యామలరావు భయపడిపోయి దొంగల బారి నుంచి రక్షించుకునేందుకని అమాంతం మేడపై నుంచి దూకేశారు.
వీరు దూకిన ప్రదేశంలో రాళ్లు ఉండటంతో వీరిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని వెంటనే టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే వీరివురిలో తీవ్రంగా గాయపడిన కిర్రి అరుణ్కుమార్ కోమాలోకి వెళ్లిపోయాడు. మరో యువకుడు దేవాది శ్యామలరావుకు ప్రాణాపాయం లేనట్లు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం వీరిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు విచారణ జరుపుతున్నారు.